మతిస్థిమితం లేని కుమారుడి చేతిలో తండ్రి హతం
ABN , First Publish Date - 2020-08-12T15:18:01+05:30 IST
మతిస్థిమితం లేని కుమారుడి చేతి లో తండ్రి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం నిర్ధవెల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
కేశంపేట(రంగారెడ్డి): మతిస్థిమితం లేని కుమారుడి చేతి లో తండ్రి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం నిర్ధవెల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై కోన వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్ధవెల్లి గ్రామానికి చెందిన బ్యాగరి చెన్నయ్య(60) కుమారుడు మహేష్ కు కొంత కాలంగా మానసిక స్థితి సరిగా లేదు. మహేష్ ను తరచూ ఆసుపత్రిలో చూపించేవారు. సోమవారం కూడా పిచ్చిగా ప్రవర్తిస్తుండంతో షాద్నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తండ్రి చెన్నయ్య తీసుకెళ్లాడు. తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో లేమామిడి దగ్గర బస్సు దిగి కాలినడకన ఇరువురు నిర్ధవెల్లి బయలుదేరారు. మార్గమద్యలో మహేష్ పిచ్చిగా ప్రవర్తిస్తూ గ్రామానికి వెళ్లవద్దంటూ తండ్రిపై తిరగపడ్డాడు.
తండ్రిని వదిలించుకొని మహేష్ పారిపోతుండగా తండ్రి వెంబడించాడు. ఈ క్రమంలో మహేష్ కాలిని చెన్నయ్య పట్టుకోగా మహేష్ కాలు విదిలించడంతో చెన్నయ్య పక్కన ఉన్న గోతిలో పడిపోయాడు. తండ్రి నీటి గుంతలో పడిపోవడం గమనించిన మహేష్ తానుకూడా తలను రాతిబండకేసి కొట్టుకున్నాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన మహేష్ మరుసటి రోజు గ్రామ పెద్దలకు విషయం చెప్పడంతో గ్రామస్థులు వెళ్లి చూసే సరికి చెన్నయ్య విగతజీవిగా పడి ఉన్నాడు. చెన్నయ్య కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.