తల్లడిల్లి.. ఊపిరాగి

ABN , First Publish Date - 2020-05-28T10:37:01+05:30 IST

బుధవారం ఉదయం 7.30 గంటలకు పలమనేరు సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుకు వేగంగా వస్తున్న కారును

తల్లడిల్లి.. ఊపిరాగి

  • - అనారోగ్యంతో తండ్రి మృతి
  • - గుండెపోటుతో మృతిచెందిన కుమారుడు 

చిత్తూరు రూరల్‌, మే 27: బుధవారం ఉదయం 7.30 గంటలకు పలమనేరు సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుకు వేగంగా వస్తున్న కారును పోలీసులు ఆపారు. తండ్రి అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామం వెళ్తున్నానని అందులో ఉన్న వ్యక్తి వివరించారు. వారు ఆధారాలు చూపించాలని కోరగా... గుండెదిటువు చేసుకుంటూనే కుటుంబీకులు వాట్స్‌పలో పంపిన తండ్రి మృతదేహం ఫొటోను చూపించారు. ఆ వివరాలను పోలీసులు పరిశీలిస్తుండగానే, చిత్తూరు మండలం నల్లవెంకటయ్యగారిపల్లెకు చెందిన నీరజాక్షుల నాయుడు(55) అలియాస్‌ బాబు నాయుడు కుప్పకూలిపోయారు. పరీక్షించిన వైద్యులు ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బంధువులు అదే కారులో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా, బాబు నాయుడి తండ్రి ఆంజనేయ  నాయుడు(78) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. దీంతో తండ్రి అంత్యక్రియల నిమిత్తం బెంగళూరులో నివాసముంటున్న ఆయన బుధవారం తెల్లవారుజామున కారులో నల్లవెంకటయ్యగారిపల్లెకు బయలుదేరారు. పలమనేరు వద్ద పోలీసులకు వివరాలు చెబుతూనే గుండెపోటుకు గురై బాబు నాయుడు మృతిచెందారు. బుధవారం సాయంత్రం తండ్రీకొడుకుల మృతదేహాలకు కుటుంబీకులు, బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో నల్లవెంకటయ్యగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2020-05-28T10:37:01+05:30 IST