కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని తెలిసి.. ఓ తండ్రి చేసిన ఘోరమిదీ..!

ABN , First Publish Date - 2020-05-21T16:49:22+05:30 IST

ప్రేమన్నాడు.. పెళ్లి చేసుకుందామని వేధించాడు. చివరకు సదరు యువతి సంబంధీకులు కొట్టిన దెబ్బలకు కన్నుమూశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన నిజాంపేట మండలం రాంపూర్‌ గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని తెలిసి.. ఓ తండ్రి చేసిన ఘోరమిదీ..!

రాంపూర్‌లో ఘటన

గతంలోనూ హతుడిపై పోక్సో కేసు 


నిజాంపేట(మెదక్): ప్రేమన్నాడు.. పెళ్లి చేసుకుందామని వేధించాడు. చివరకు సదరు యువతి సంబంధీకులు కొట్టిన దెబ్బలకు కన్నుమూశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన నిజాంపేట మండలం  రాంపూర్‌ గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం రాంపూర్‌ గ్రామానికి చెందిన నర్సింహులుగౌడ్‌ (30) కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు గతేడాది ఫిబ్రవరిలో నర్సింహులుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో జైలుకు వెళ్లిన సదరు యువకుడు జైలు జీవితం కూడా అనుభవించి వచ్చాడు. అయినా ఆయన వేధింపులు ఆగకపోవడంతో అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చారు సదరు యువతి కుటుంబసభ్యులు.


ఈ మేరకు బుధవారం ఉదయం పొలానికి వెళ్లిన నర్సింహులుపై యువతి తండ్రి యాడారం నాగరాజుగౌడ్‌, మరికొందరు మాటువేసి బండరాళ్లతో మోదారు. నర్సింహులు కొన ఊపిరితో ఉండగా వదిలి పారిపోయారు. విషయం తెలిసిన నర్సింహులు తండ్రి రాజారాంగౌడ్‌ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలో చనిపోయాడు. నర్సింహులు ఎన్నడూ సదరు యువతిని వేధించనే లేదని, ఆ అమ్మాయే ప్రేమ పేరుతో తన కొడుకు వెంట తిరిగిందని వాపోయారు.  కక్షగట్టిన అమ్మాయి తల్లిదండ్రులు గతంలో కూడా కేసు పెట్టారని, మంగళవారమే తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ రాయబారం కూడా పంపారని తెలిపారు. అయితే తమకు నమ్మకం లేక నిరాకరించామని రాజారాంగౌడ్‌ వివరించారు. అదే అక్కసుతో అమ్మాయి తండ్రితో సహా ఎనిమిది మంది బంధువులు తన కొడుకును కొట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్‌టీమ్‌ పోలీసులు ఆధారాలు సేకరించారు. గ్రామంలో గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ నాగార్జునగౌడ్‌ తెలిపారు.  

Updated Date - 2020-05-21T16:49:22+05:30 IST