కరీంనగర్‌లో మళ్లీ భయం

ABN , First Publish Date - 2020-05-24T10:55:18+05:30 IST

కరీంనగర్‌లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. కువైట్‌ నుంచి వచ్చిన ఒకవ్యక్తి ఏడు రోజులు కరీంనగర్‌లో ఉండి వెళ్లగా

కరీంనగర్‌లో మళ్లీ భయం

కరోనా పాజిటివ్‌ వ్యక్తి ఏడు రోజులు ఇక్కడే మకాం

ఆందోళనలో నగరవాసులు


కరీంనగర్‌, మే 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. కువైట్‌ నుంచి వచ్చిన ఒకవ్యక్తి ఏడు రోజులు కరీంనగర్‌లో ఉండి వెళ్లగా అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అతడిని కలిసిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ నెల 10వ తేదీన కువైట్‌ నుంచి వచ్చారు. నిబంధనల ప్రకారం అదికారులు అతడిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పేయిడ్‌ క్వారంటైన్‌కు పంపించారు. సదరు వ్యక్తి సమీప బంధువు చనిపోవడంతో అతడిని ఇంటికి వెళ్లడానికి అనుమతించారని సమాచారం.


ఈ నెల 16న ఆయన కరీంనగర్‌కు వచ్చి 22వ తేదీ వరకు ఇక్కడే ఉండి క్వారంటైన్‌కు తిరిగి వెళ్లారు. అక్కడ మళ్లీ పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ వ్యక్తిని ఈ ఆరు రోజుల పాటు ఎవరెవరు కలిశారు, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్న విషయాలను జిల్లా అధికారులు సేకరించడం ప్రారంభించారు.  ఇటీవలే గ్రీన్‌ జోన్‌లోకి మారిన కరీంనగర్‌లో కరోనా భయం మళ్లీ కలకలం సృష్టిస్తున్నది.


ముంబై నుంచి తిరిగి వచ్చిన చొప్పదండికి చెందిన ఇద్దరు వలస కార్మికులకు కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో వివిఽధ రాష్ట్రాల నుంచి వచ్చిన 1,089 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వారిలో పలువురు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి అందరితో కలిసి తిరుగుతుండడంతో కరీంనగర్‌ మళ్లీ కరోనా గుప్పిట్లోకి పోతుందా అని పలువురు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-05-24T10:55:18+05:30 IST