బడిలో కొవిడ్ భయం
ABN , First Publish Date - 2022-01-19T06:27:55+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కరోనా కల్లోలం మొదలైంది.
ఒక్కరోజే 17మందికి పాజిటివ్
ఒంగోలు విద్య, జనవరి 18 : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కరోనా కల్లోలం మొదలైంది. మంగళవారం ఒక్క రోజే 17మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 15మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జడ్పీ హైస్కూలు, ఒంగోలు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, డీఆర్ఆర్ఎం హైస్కూల్లో ఇద్దరి చొప్పున పాజిటివ్ వచ్చింది. అలాగే ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయం, మార్కాపురం శారదా ఎయిడెడ్ పాఠశాల, కనిగిరి నందన మారెళ్ళ, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు జె.పంగులూరు మండలం రేణింగవరం ఎంపీపీఎస్లలో ఒక్కో కేసు వెలుగు చూశాయి. యద్దనపూడి మండలం యనమదల ఎంపీయూపీఎస్, గన్నవరం ఏంపీపీఎస్, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం ఎంపీయూపీఎస్, చీరాల బోయనవారిపాలెం ఏంపీపీఎస్ స్కూళ్లలో ఒక్కో ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. త్రిపురాంతకం మండలం మేడపి జడ్పీ హైస్కూలు, యద్దనపూడి మండలం పూనూరు జడ్పీ హైస్కూళ్లలో బోధనేతర సిబ్బంది ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మంగళవారం ఫలితాలు వచ్చిన వెంటనే వీరంతా హోమ్ ఐసోలేషన్కు వెళ్లారు. కరోనా వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపఽథ్యంలో పాఠశాలలకు ప్రభుత్వం వెంటనే సెలవులు ప్రకటించి విద్యార్థులు, ఉపాధ్యాయులను కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.