ట్రంప్ విమానానికి ధీటుగా మోదీ కొత్త విమానం..!

ABN , First Publish Date - 2020-06-05T22:41:39+05:30 IST

అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలకు వెళ్లిన ప్రతిసారి మేఘాలను చీల్చుకుంటూ దూసుకొచ్చే ఎయిర్ ఫోర్స్ ...

ట్రంప్ విమానానికి ధీటుగా మోదీ కొత్త విమానం..!

న్యూఢిల్లీ: దేశంలోని ముగ్గురు వీవీఐపీలు... రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచూ ప్రయాణించే విమానాల జాబితాలో అత్యాధునిక విమానాలు చేరనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌కు ధీటుగా భద్రత కల్పించేలా వీటిని రూపొందించడంతో వీటికి విశేష ప్రాచుర్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ వన్‌కు, ఎయిరిండియా వన్ 777కు మధ్య తేడాలు, ప్రత్యేకతలు మీకోసం.. 








 



కదిలి వచ్చే శ్వేత సౌధం ఎయిర్ ఫోర్స్ వన్..!



అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలకు వెళ్లిన ప్రతిసారి మేఘాలను చీల్చుకుంటూ దూసుకొచ్చే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఇందులోనే ఓ వోవల్ ఆఫీసు, కాన్ఫరెన్స్ రూమ్, మంత్రుల బృందానికి సరిపడా ఏర్పాట్లు ఉండడంతో... ఈ విమానాన్ని కదిలి వచ్చే శ్వేతసౌధంగా అభివర్ణిస్తారు. ఇందులోని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం. 


- యుద్ధాన్ని దృష్టిలోకి ఉంచుకుని తయారు చేసిన ఈ విమానంలో అణుదాడిని సైతం తట్టుకోగల సామర్థ్యం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అణుదాడి జరిగితే ఇందులో ఉన్న అమెరికా అధ్యక్షుడిని కనీసం తాకే అవకాశం ఉండదు. యుద్ధానికి సంబంధించిన వ్యూహాలు రచించేందుకు, అందులో నుంచే ఆదేశాలు జారీ చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. 


- గాల్లోనే ఇంధనం నింపుకునే సౌకర్యం ఉండడంతో.. ఇంధనం కోసం నేలకు దిగి సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 


- ముడుచుకునే మెట్ల దారితో పాటు సొంత బ్యాగేజీ లోడర్ సదుపాయం కూడా ఉంది. దీంతో ఎయిర్‌పో్ర్టు స్టైర్ వే కోసం వేచిచూడాల్సిన అవసరం ఉండదు. అలాగే అవసరంలేని, అనుమానాస్పద వస్తువులేవీ విమానంలోకి వచ్చే అవకాశం ఉండదు.


- యుద్ధంలో ఉపయోగకరంగా ఉండడంతో పాటు, అధ్యక్షుడి సురక్షిత ప్రయాణానికి ఉద్ధేశించినది కాబట్టి ఇందులో భద్రతా పరమైన పలు విలక్షణ సదుపాయాలు కూడా ఉన్నాయి. శత్రు రాడార్లను గుర్తించి వాటిని స్తంభింప చేయడంలో ఇది దిట్ట. క్షిపణులను ప్రయోగించే విధంగా వాటిపై అగ్ని జ్వాలలను సైతం విడుదల చేయగలదు. మిర్రర్ బాల్ డిఫెన్స్ టెక్నాలజీతో శత్రు రాడార్ల తుత్తునియలు చేస్తుంది. 


- ఎయిర్‌ఫోర్స్ వన్‌లో 630 నుంచి 700 మైళ్ల వేగంతో ప్రయాణించగల నాలుగు సీఎఫ్6-80సీ2బీ1 జెట్ ఇంజన్లు ఉన్నాయి. 


-సమాచార వ్యవస్థలో దీన్ని మించింది లేదంటే నమ్మశక్యం కాదు. అధ్యక్షుడు ఆకాశంలో నుంచే సంభాషణ జరిపే విధంగా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. విమానంలో నుంచే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే సదుపాయం.. ఇలా ఎన్నో సమాచార ప్రత్యేకతలు ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్నాయి. గాల్లోనే ఇంధనం నింపుకునే అవకాశం ఉండడంతో అధ్యక్షుడు యుద్ధ సమయంలో అవసరమైతే కొన్ని రోజుల పాటు గాల్లో నుంచే కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. 


- శత్రువులు దెబ్బకొట్టేది ముందు కమ్యునికేషన్ వ్యవస్థపైనే కాబట్టి... దీనికి సంబంధించిన వస్తువులు ఎక్కడున్నాయో కూడా తెలియనంత రహస్యంగా దాచుకోవడం ఈ విమానంలో మరో ప్రత్యేకత. ఇందులోని రహస్య జీపీఎస్ సిగ్నల్స్ సమాచార ప్రామాణికతను అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయి. 


- దురదృష్ట వశాత్తూ ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రయాణంలోనే వైద్య సదుపాయం అందుకునేందుకు పూర్తి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. అధ్యక్షుడు, మంత్రులకు వైద్యం అందించేందుకు ఎల్లప్పుడూ ఓ డాక్టర్ అందుబాటులో ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య ప్రణాళిక కూడా ఇందులో సిద్ధంగా ఉంటుంది. రెండు కిచెన్లు కూడా ఉన్నాయి.


- దీని పొడవు 232 అడుగులు, ఎత్తు 63 అడుగులుగా ఉంది. సేవలు అందించేందుకు 26 మంది క్రూ మెంబర్స్ అందుబాటులో ఉంటారు. సమాచార వ్యవస్థ కోసం 20 టీవీలు, 85 ఫోన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కాల్స్ కోసం తెలుపు రంగు ఫోన్లు, రహస్య సంభాషణల కోసం లేతగోధుమ రంగు ఫోన్లు ఉన్నాయి. సిబ్బంది కోసం క్వార్టర్లతో పాటు, 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటీరియర్ స్పేస్‌లో 76 మంది ప్రయాణించే సదుపాయం ఉంది. 


- శత్రు దుర్బేధ్యమైన ఈ విమానాన్ని శిక్షణ లేకుండా ఆపరేట్ చేసే అవకాశమే లేదు. ఇందులో ఉన్న ఫీచర్లు, ఉపయోగించే టెక్నాలజీలు సహా సమాన్యులకు అర్థం కాని ఎన్నో విశేషాలు ఇందులో ఉన్నాయి. మిలటరీ ఏజెంట్లు సైతం ఇందులోని ఫీచర్లను అర్థం చేసుకోవడం కష్టతరం కావడం వల్ల దీనికి మిలటరీయేతర అరివీర భయంకర యుద్ధ విమానంగా పేరొచ్చింది. 


మోదీ మార్క్ ఫీచర్లతో బోయింగ్ 777-300 ఈఆర్!


దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ తాజాగా భారత దేశాధినేతలు ప్రయాణించేందుకు శత్రు దుర్బేధ్యమైన మూడు విమానాలు దేశానికి సమకూరనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్న బోయింగ్ 777-300 ఈఆర్ విమానాల్లో.. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్‌కు ధీటుగా విలక్షణ రక్షణ సదుపాయాలు ఉన్నాయి. మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (ఎండీఎస్‌)తో పాటు శక్తిమంతమైన ఈడబ్ల్యూ జామర్‌, మిర్రర్‌ బాల్‌ ఈక్వలెంట్‌ సిస్టం, క్షిపణి హెచ్చరిక వ్యవస్థ వంటి ఎన్నో సదుపాయాలున్న ఈ విమానాల్లో మరిన్ని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం..


- ఇందులో అత్యాధునిక రక్షణ వ్యవస్థలను పొందుపర్చిన కారణంగా ఇకపై భారత వైమానిక దళానికి చెందిన నిపుణులతో పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. సాధారణంగా ఎయిరిండియా పైలెట్లే ఎయిరిండియా వన్ విమానాలను నడిపిస్తారు.


- అమెరికాలోని డల్లాస్‌లో బోయింగ్ తయారీ కేంద్రాల్లో తయారైన ఈ విమానాలకు ఆధునిక సైనిక రక్షణ వ్యవస్థలు, ప్రత్యేకంగా క్యాబిన్‌లో మార్పులు చేసి పునర్నిర్మించారు.


- ఇందులో గంటకు 900 కిలోమీటర్లు ప్రయాణించగల రెండు జీఈ90-115 ఇంజిన్లు ఉంటాయి.


- గాల్లోనే ఇంధనం నింపుకునే సదుపాయం కూడా ఉంది. దీంతో ప్రయాణం మధ్యలో ఇంధనం కోసం కిందికి దిగాల్సిన అవసరం లేదు.


- రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని భద్రత కోసం భారత్ ఈ విమానాల్లో దేశీయ మిలటరీ రక్షణ వ్యవస్థలను పొందుపర్చుతోంది. ఇందులో అతిపెద్ద వైమానిక పరారుణ నిరోధక ప్రమాణాలు (ఎల్ఏఐఆర్‌సీఎం), స్వీయ- రక్షణ సూట్లు (ఎస్‌పీఎస్) తదితర వ్యవస్థలు కీలకమైనవి.


- ప్రయాణంలో ఉండగా దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ వ్యవస్థలు విమానాన్ని కాపాడగలవు.


- ఈ విమానాల విలువ 190 మిలియన్ డాలర్లు కాగా.. ఇందులోని రక్షణ వ్యవస్థల స్వభావాన్ని బట్టి అమెరికా విదేశాంగ శాఖ అనుమతి తర్వాతే వీటిలో మార్పులు చేశారు.


- ఈ విమానాల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్లు కూడా ఉన్నాయి. దీంతో ఏదైనా దాడులు జరిగినప్పుడు వెనుదిరగకుండా.. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టగలదు.


- అమెరికా అధ్యక్షుడు ఉపయోగిస్తున్న ఎయిర్‌ఫోర్స్ వన్ తర్వాత ఆ తరహాలో రూపుదిద్దుకున్న శత్రుదుర్బేధ్య విమానం ఎయిరిండియా వన్ 777 కావడం విశేషం.

Updated Date - 2020-06-05T22:41:39+05:30 IST