కాస్ట్లీ దొంగలు.. ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో వచ్చి చోరీ

ABN , First Publish Date - 2020-07-01T21:18:20+05:30 IST

వాళ్లు మామూలు దొంగలు కాదు. హైటెక్ దొంగలు. భారీ స్కెచ్‌లు వేస్తారు. అవసరం అయితే ఫ్లైట్‌లలో వెళతారు.

కాస్ట్లీ దొంగలు.. ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో వచ్చి చోరీ

హైదరాబాద్: వాళ్లు మామూలు దొంగలు కాదు. హైటెక్ దొంగలు. భారీ స్కెచ్‌లు వేస్తారు. అవసరం అయితే ఫ్లైట్‌లలో వెళతారు. పెద్ద పెద్ద హోటళ్లలో బస చేస్తారు. తాజాగా నగరానికి వచ్చి.. పోలీసుల చేతికి చిక్కారు. ఈ కాస్ట్లీ దొంగల అసలు కథలోకి వెళితే.. నగరానికి చెందిన దినేశ్ గాంధీ మే నెలలో రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఫెరారీ కారును కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం రంగారెడ్డి జిల్లాకు చెందిన నీరజ్ శర్మ అనే బ్రోకర్‌ను సంప్రదించారు. దీనికి సంబంధించిన పత్రాలను నీరజ్‌కు దినేశ్ అప్పగించాడు. అయితే నీరజ్ ఆ పనిని ఢిల్లీలో ఉండే మరో వ్యక్తికి ఇచ్చాడు. అక్కడ కథ మరో మలుపు తిరిగింది. అక్కడున్న వ్యక్తి ఆ పత్రాలను ఫోర్జరీ చేసి ఇంకో వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. కారును తీసుకు రావాలంటూ సదరు వ్యక్తి ఢిల్లీ నుంచి భూపేందర్‌, సద్దాం అనే ఇద్దరిని నగరానికి పంపించాడు. గ‌త నెల 21న వాళ్లిద్దరూ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వ‌చ్చారు. స్థానికంగా ఓ స్టార్ హోట‌ల్‌లో బ‌స చేశారు. అక్కడే ప్లాన్‌పై చర్చించుకుని.. జూన్ 23న రాత్రి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. కార్ఖానాలో కారు ఉన్న ప్రాంతానికి వెళ్లి దాన్ని దొంగలించారు. కారు చోరీకి గురైందని తెలుసుకున్న దినేశ్.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీని గమనించిన పోలీసులు.. గంటల వ్యవధిలోనే దొంగలను అదుపులోకి తీసుకన్నారు. టోలీచౌకీలో ఉన్న కారును సీజ్ చేసి, నిందితులు భూపేందర్‌, సద్దాంను కస్టడీకి తరలించారు. బ్రోకర్ నీరజ్‌శర్మను కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-07-01T21:18:20+05:30 IST