పండుగపూట విషాదం
ABN , First Publish Date - 2021-10-15T04:27:01+05:30 IST
ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతిచెందిన సంఘటన గురువారం దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, కూతురు మృతి
ఎనగుర్తి గ్రామంలో విషాదఛాయలు
దుబ్బాక, అక్టోబరు 14: ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతిచెందిన సంఘటన గురువారం దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రోజా(28) ఇద్దరు కూతుళ్లతో కలిసి ఎనగుర్తి గ్రామంలోని తల్లిగారింటికి పండుగ నిమిత్తం వచ్చింది. గురువారం గ్రామంలోని చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు రోజా కూతుళ్లతో కలిసి వెళ్లింది. బట్టలు ఉతికేసమయంలో చిన్న కూతురు చైత్ర(5) అడుకుంటూ చెరువు గట్టుపై నుంచి జారి చెరువులో పడింది. కూతురును కాపాడబోయిన తల్లి కూడా చెరువులో పడి నీట మునిగింది. గట్టుపై ఉన్న పెద్దకూతురు రశ్మిక కేకలకు స్థానికులు అక్కడికి చేరుకొని విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారమందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో తల్లీకూతుళ్ల మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించడం స్థానికులను కలచివేసింది. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. రోజా భర్త చెప్యాల నరేష్ కూడా ఇటీవలే మృతిచెందినట్టు తెలిపారు. దీంతో గ్రామంలో విషాఽధచాయలు నెలకొన్నాయి.