చారిటీ మ్యాచ్‌.. బ్యాట్లతో తలలు పగలగొట్టుకుని..

ABN , First Publish Date - 2021-07-21T06:15:13+05:30 IST

చారిటీ మ్యాచ్ జరుగుతుండగా ఇరు జట్ల మధ్య వివాదం రేగి బ్యాట్లతో తలలు పగలగొట్టుకున్నారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ..

చారిటీ మ్యాచ్‌.. బ్యాట్లతో తలలు పగలగొట్టుకుని..

లండన్: చారిటీ మ్యాచ్ జరుగుతుండగా ఇరు జట్ల మధ్య వివాదం రేగి బ్యాట్లతో తలలు పగలగొట్టుకున్నారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఇరు జట్ల క్రికెటర్ల మధ్య మాటామాటా పెరిగింది. చిన్న ఘర్షణగా మొదలైన గొడవ రక్తసిక్తంగా మారింది. ఘర్షణలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్రంగా గాయాలపాలయ్యారు.


పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం షెహజాద్ అక్రమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ నిర్వహించారు. స్థానిక మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఎంతో గొప్ప కారణం కోసం జరగిన ఈ మ్యాచ్.. మంచి జరగడం అటుంచితే రణరంగంగా మారింది. ఆటగాళ్ల రక్తంతో మైదానం తడిసింది. గొడవకి కారణం ఏంటనే విషయం వెలుగులోకి రానప్పటికీ.. ఈ వివాదానికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోను చూస్తే.. ఓ ఫీల్డర్‌పై బ్యాట్స్‌మెన్ దాడి చేసినట్లు కనిపిస్తుంది. దాంతో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వివాదం రేగింది. ఒకరిపై ఒకరు బాట్లతో దాడి చేసుకున్నారు. మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు వారిని కట్టడి చేసేందకు ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. ఈ దాడులతో మ్యాచ్ అర్థాంతరంగా మారిపోయింది.


కాగా, ఈ గొడవ విషయమై మ్యాచ్‌ నిర్వహకుడు షెహజాద్‌ స్పందిస్తూ.. ఇది ఫైనల్ మ్యాచ్‌ అని, మరో 2 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న దశలో కొందరు గ్రౌండ్‌లోకి వచ్చి గొడవ మొదలుపెట్టారని, ఓ ఇద్దరు ముగ్గురు బ్యాట్‌లతో ఆటగాళ్లని తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. ఈ వివాదంతో చారిటీ మ్యాచ్ ఉద్దేశమే నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వివాదానికి అసలు కారణం ఏంటో ఇంకా తెలియలేదని చెప్పడం గమనార్హం.



Updated Date - 2021-07-21T06:15:13+05:30 IST