మార్కెట్‌లో కలకలం.. ఫ్రెండ్స్ మధ్య గొడవ.. చివరికిలా..!

ABN , First Publish Date - 2021-01-14T12:04:50+05:30 IST

మార్కెట్‌లో కలకలం.. ఫ్రెండ్స్ మధ్య గొడవ.. చివరికిలా..!

మార్కెట్‌లో కలకలం.. ఫ్రెండ్స్ మధ్య గొడవ.. చివరికిలా..!

  • స్నేహితుడిపై కత్తితో దాడి 
  • పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు పెట్టిన బాధితుడు
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. కత్తితో స్నేహితుడి గుండెలో పొడవడంతో గాయపడిన వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన మంగళ్‌హాట్‌ మార్కెట్‌లో ఆదివారం కలకలం రేపింది. బీహర్‌కు చెందిన చాంద్‌(20) అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి మంగళ్‌హాట్‌ మార్కెట్‌లో పనిచేసుకుంటూ అక్కడే ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్నాడు. ఆగాపురా అఫ్జల్‌సాగర్‌లో నివాసం ఉండే హజ్జు(19) అనే యువకుడు కూడా మంగళ్‌హాట్‌ మార్కెట్‌లోనే పనిచేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు.


గత ఆదివారం చిన్న పాటి విషయంలో హజ్జును చాంద్‌ కొట్టడడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రెండు రోజులుగా హజ్జు మంగళ్‌హాట్‌ మార్కెట్‌కు రాలేదు. బుధవారం పని చేసుకునేందుకు మార్కెట్‌కు హజ్జు రావడంతో అక్కడే ఉన్న చాంద్‌ మరో మారు బెదిరింపులకు దిగాడు. తరచూ తనను బెదిరిస్తున్నాడనే కోపంతో రగిలిపోయిన హజ్జు తను పనిచేస్తున్న దుకాణానికి సమీపంలోని చికెన్‌ షాప్‌లోకి వెళ్లి కత్తి తీసుకొని చాంద్‌ గుండెలో పొడిచాడు.


తీవ్ర గాయాలతో ఉన్న చాంద్‌ సమీపంలోనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వద్దకు పరుగులు పెట్టాడు. పోలీసు సిబ్బంది వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఇన్‌స్పెక్టర్‌ రణవీర్‌ రెడ్డి, ఎస్‌ఐలు జగన్‌, రాజశేఖర్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించడంతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-14T12:04:50+05:30 IST