ఉద్యోగాలను భర్తీ చేయకపోతే సీఎం ఇల్లు ముట్టడి
ABN , First Publish Date - 2021-07-13T15:57:03+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని..
ఉద్యోగ పోరాట సమితి హెచ్చరిక
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటితో ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ని ప్రకటించడంతోపాటు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్ట్టడిస్తామని ఉద్యోగ పోరాట సమితి హెచ్చరించింది. ప్రెస్క్లబ్లో సోమవారం జాబ్ క్యాలెండర్, ఖాళీ పోస్టులపై విద్యార్థి, యువజన సంఘాలు, ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స కన్వీనర్ చిన్నారి, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి అమర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర, కార్యదర్శి సూర్యారావు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన జగన్మోహన్రెడ్డి, అధికారంలోకి వచ్చాక కేవలం 10,143 ఖాళీలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో 2.4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని, తక్షణమే అన్ని పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 19న సీఎం ఇంటిని లక్ష మంది నిరుద్యోగులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సదస్సులో పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సురేశ్, ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు, రాజేంద్రబాబు, డీవైఎఫ్ఐ రాజు, తెలుగు యువత తాతాజీ, అమర్, రతన్, సత్యనారాయణ, ఫణీంద్ర, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.