మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించిన దుండగులు అరెస్ట్
ABN , First Publish Date - 2020-08-02T16:31:35+05:30 IST
సినీ నటుడు మోహన్బాబు ఇంటి దగ్గర హల్చల్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: సినీ నటుడు మోహన్బాబు ఇంటి దగ్గర హల్చల్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి జల్పల్లిలోని మోహన్బాబు ఇంటికి అగంతకులు వచ్చి.. బెదిరించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ, కార్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను మైలర్దేవులపల్లిలోని దుర్గానగర్కు చెందిన యువకులుగా గుర్తించారు. అగంతకుల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.
శనివారం రాత్రి ఏపీ 31 ఏఎన్ 0004 ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు.. మిమ్మల్ని వదలమంటూ హెచ్చరించి వెళ్లారు. దీంతో భయానికి లోనైన మోహన్బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. మోహన్బాబు ఇంటి వాచ్మెన్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే వారు లోనికి వచ్చినట్లు తెలిసింది. వెంటనే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి.. 24 గంటల్లోపే దుండగులను అదుపులోకి తీసుకున్నారు.