నిధులొచ్చాయ్...
ABN , First Publish Date - 2021-05-05T06:33:48+05:30 IST
రెండో విడత ఆర్థిక సంఘం నిధులను పరిషత్లకు జమ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది.
పరిషత్లకు చేరిన రెండో విడత
ఆర్థిక సంఘం నిధులు
పల్లెల్లో ఊపందుకోనున్న పనులు
ఒంగోలు(జడ్పీ), మే 4: రెండో విడత ఆర్థిక సంఘం నిధులను పరిషత్లకు జమ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. రెండో విడత రూ.14 కోట్లు విడుదల చేసింది. తొలివిడతకు సంబంధించి రూ.15.68కోట్లను గత జూలైలోనే ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం నిధులను జిల్లా, మండల పరిషత్లకు సమానా వాటాలో కేటాయించాల్సి ఉంది. దీంతో అధికారులు జిల్లా పరిషత్కు రూ.7కోట్లు, మండల పరిషత్లన్నింటికీ కలిపి రూ.7కోట్లను వినియోగించనున్నారు. గతంలో ఆర్థిక సంఘం నిధులను పరిషత్లకు కేటాయించే ఆనవాయితీ లేకపోయినా తొలిసారిగా 15వ ఆర్థికసంఘం సిఫార్సులతో రెండు విడతల్లో పరిషత్లకు కూడా వాటిలో వాటా దక్కింది. పల్లెల్లో పడకేసిన పనులకు ఈ నిధులతో కొంతమేర మోక్షం లభించే అవకాశం ఉంది. పారిశుధ్యం, చేతిపంపుల ఏర్పాటుతో పాటు వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి వసతిపై కూడా అధికారులు దృష్టి సారించనున్నారు. కొవిడ్ దృష్ట్యా పారిశుధ్యంపై కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా యంత్రాంగం శ్రద్ధ పెట్టనుంది.