వచ్చే ఏడాది పరుగే...

ABN , First Publish Date - 2020-05-28T09:08:16+05:30 IST

భారత ఆర్థిక రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పునరుజ్జీవం సాధించి 5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అంచనా వేశారు.

వచ్చే ఏడాది పరుగే...

  • ఆర్థిక రంగంపై దువ్వూరి అంచనా

ముంబై : భారత ఆర్థిక రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పునరుజ్జీవం సాధించి 5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అంచనా వేశారు. ప్రస్తుతం నెలకొన్న నిరాశాపూరిత వాతావరణంలో ఈ ఏడాది 5 శాతం ప్రతికూల వృద్ధి ఖాయమన్న అంచనాల నడుమ ఆయన మాట మండుటెండలో చిరుజల్లులా తా కింది. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ స్వాతంత్య్రం తర్వాత నాల్గవ తిరోగమనం చవి చూడబోతున్నదని, దేశచరిత్రలోనే ఇది భారీ తిరోగమనం కాగలదని క్రిసిల్‌ అంచనా వేసిన విషయం విదితమే. 


కొవిడ్‌-19 ప్రకృతి వైపరీత్యం కాదని, మన ఫ్యాక్టరీలు, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ తాత్కాలికంగా మూత పడినా అవకాశం రాగానే తిరిగి జోరందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన చెబుతూ వచ్చే ఏడాది పునరుజ్జీవం సాధ్యమనడానికి అదే కారణమని భవన్‌ ఎస్‌పీజీఐఎంఆర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ స్టడీస్‌ నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడుతూ సుబ్బారావు విశ్లేషించారు. ప్రస్తుత కల్లోలం మాత్రం తీవ్రమైన బాధను మిగుల్చుతుందని, అనియత రంగంలోని పలు సంస్థలు  మూతపడవచ్చునని ఆయ న చెప్పారు. ఇంత నిరాశావహ స్థితిలో కూడా విదేశీ వాణిజ్యంలో సాపేక్ష స్థిరత్వం, అద్భుతమైన వ్యవసాయ దిగుబడులు సానుకూలమైన అంశాలని ఆయన చెప్పారు. 


మాంటెక్‌దీ అదే మాట

ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా కూడా ఇదే అభిప్రాయం ప్రకటిస్తూ 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ 5-6 శాతం వృద్ధి సాధించవచ్చునని చెప్పారు. కాని దీన్ని రికవరీగా భావించడానికి లేదని, ఇప్పుడు 5 శాతం క్షీణత ఏర్పడినందు వల్ల ఆ తర్వాత ఆ స్థాయి నుంచి 6 శాతం పురోగమించినప్పటికీ వృద్ధిరేటు 2019-20 స్థాయిలోనే ఉంటుందన్న విషయం ఆయన గుర్తు చేశారు. 

Updated Date - 2020-05-28T09:08:16+05:30 IST