2,500 మంది ఎస్పీ నేతలపై కొవిడ్ కేసు
ABN , First Publish Date - 2022-01-15T12:07:28+05:30 IST
సమాజ్వాదీ కార్యాలయం వద్ద భారీగా జనం గుమిగూడినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మా సిబ్బందిని పంపించాము. దేశంలో కొవిడ్ కేసులు ఎక్కువైన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. కానీ ఎస్పీ నేతలు వాటిని ఉల్లంఘించారు..
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీకి చెందిన 2,500 మంది నేతలపై కొవిడ్ ఉల్లంఘటన కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం భారతీజ జనతా పార్టీ మాజీ నేత స్వామి ప్రసాద్ మౌర్య.. ఎస్పీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన సభలో కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులో లఖ్నవూ పోలీసులు పేర్కొన్నారు. వారిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 188, 269, 270, 341 కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు గుమిగూడారని, ఇది కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు వెల్లడించారు.
ఈ విషయమై లఖ్నవూ కమిషనర్ డీకే ఠాకూర్ మాట్లాడుతూ ‘‘సమాజ్వాదీ కార్యాలయం వద్ద భారీగా జనం గుమిగూడినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మా సిబ్బందిని పంపించాము. దేశంలో కొవిడ్ కేసులు ఎక్కువైన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. కానీ ఎస్పీ నేతలు వాటిని ఉల్లంఘించారు’’ అని అన్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నాయకులు తదుపరి ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.