వెహికల్ డిపోలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2021-05-19T06:20:18+05:30 IST
స్థానిక పూర్ణానందంపేటలోని వెహికల్డిపోలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.
రూ.9.20 లక్షల ఆస్తి నష్టం
పూర్ణానందంపేట(పాతరాజరాజేశ్వరి పేట), మే 18 : స్థానిక పూర్ణానందంపేటలోని వెహికల్డిపోలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వెహికల్ డిపోలోని పబ్లిక్ హెల్త్ (పీహెచ్) స్టోర్స్లో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగి దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. ఫైర్సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టోర్స్లోకి వెళ్లడానికి ఒకటే దారి ఉండటం, ఆ దారి అంతా దట్టమైన పొగ కమ్ముకోవడం కారణంగా స్టోర్స్లోకి వెళ్లే అవకాశం లేదని మున్సిపల్ సిబ్బందికి వారు వివరించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది స్టోర్స్ వెనుక భాగం జేసీబీ సహాయంతో కొంతభాగం గోడను కూల్చారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. స్టోర్స్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన పనిముట్లు, బ్లిచింగ్ పౌడర్ బస్తాలు, 60లీటర్ల డస్ట్బిన్ డబ్బాలు, హోం కంపోస్ట్ కిట్స్ నిల్వలు ఉన్నాయి. అగ్ని ప్రమాదానికి దాదాపుగా సామగ్రి అంతా కాలి బూడిదైందని, వాటి విలువ దాదాపు 9.20 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం నగరపాలకసంస్థ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వివరాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.