గోదాంలో చెలరేగిన మంటలు.. 50 లక్షలకు పైగా ఆస్తినష్టం

ABN , First Publish Date - 2021-03-01T13:08:03+05:30 IST

50లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది.

గోదాంలో చెలరేగిన మంటలు.. 50 లక్షలకు పైగా ఆస్తినష్టం

హైదరాబాద్/ఆదిభట్ల : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్‌లో ఓ గోదాంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగి  50లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే.. కొంగరకలాన్‌ పరిధి చెట్లళ్ల కృష్ణాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో హైదరాబాద్‌కు చెందిన వసంత్‌ పాటిల్‌ అనే వ్యాపారి ఫ్లష్‌ డోర్‌(ఇన్నర్‌ డోర్స్‌) తయారీ యూనిట్‌ నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 3గంటల సమయంలో గోదాంలో అగ్ని ప్రమాదంతో మంటలు చెలరేగడంతో కార్మికులు 101కు డయల్‌ చేశారు. ఫైర్‌ సిబ్బంది చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటల తీవ్రతతో అదుపుచేయలేక నగరం నుంచి మరో 3ఫైర్‌ ఇంజిన్లు తెప్పించారు. 


జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ పూర్ణచందర్‌ పర్యవేక్షణలో  మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. గోదాం పైకప్పు కూలే ప్రమాదం ఉండడంతో బయటి నుంచే నీటిని పంప్‌ చేస్తున్నారు. రాత్రి 8 వరకు ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మరికొద్ది సమయంలో మంటలను ఆర్పేస్తామని అధికారులు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మహేశ్వరం సీనియర్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రమేష్‌, ఆదిభట్ల ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2021-03-01T13:08:03+05:30 IST