థానే ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..కరోనా రోగుల తరలింపు
ABN , First Publish Date - 2020-08-12T11:57:23+05:30 IST
కరోనా రోగులున్న మరో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన....
థానే (మహారాష్ట్ర): కరోనా రోగులున్న మరో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన మహారాష్ట్రలోని థానే నగర పరిధిలోని గఢ్ బందర్ లో జరిగింది. గడ్ బందర్ ప్రాంతంలోని దియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి 11 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని మెడికల్ షాపు లోపల అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగినపుడు దియా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో నలుగురు కొవిడ్-19 రోగులున్నారు. అగ్నికీలలు ప్రారంభం కాగానే కరోనా రోగులను హుటాహుటిన ఇతర ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపకశాఖ వాహనాలు వచ్చి మంటలను ఆర్పారు. ఆసుపత్రిలోని రోగులను అంబులెన్సుల్లో ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. థానే ప్రాంతీయ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెల్, అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పారు.