తొలిరోజు హాజరు అంతంతే..!
ABN , First Publish Date - 2021-08-17T17:32:01+05:30 IST
కొవిడ్ విజృంభణ కారణంగా..
నాలుగు మండలాల్లో తెరచుకున్న ప్రభుత్వ పాఠశాలలు
అచ్యుతాపురం మినహా..మిగిలిన చోట్ల తక్కువ సంఖ్యలో రాక
ఎలమంచిలి: కొవిడ్ విజృంభణ కారణంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. తొలిరోజు విద్యా ర్థుల హాజరు సంఖ్య అంతంత మాత్రం గానే ఉంది. మండలంలో మొత్తం 51 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో సుమారు 35 నుంచి 40 శాతం మంది హాజరైనట్టు ఇన్చార్జి ఎంఈవో మూర్తి తెలిపారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నామన్నారు.
అచ్యుతాపురం : పాఠశాలలు పునః ప్రారంభమైన తొలి రోజు మండలంలో 93 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యా కానుక కిట్లు అందిస్తున్నట్టు ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అచ్యుతాపురంలో మాత్రం 86 శాతం వచ్చారు. కొండకర్ల ప్రాథమిక పాఠశాలను కొండకర్ల ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఖాజీపాలెం ప్రాథమిక పాఠశాలను ఖాజీ పాలెం ఉన్నత పాఠశాలలో, హరిపాలెం హరిజన కాలనీలో గల ప్రాథమిక పాఠశాలను హరిపాలెం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. కానీ వీరు ప్రస్తుతం మామూలు పాఠశాలల్లోనే ఉంటున్నారు.
మునగపాక : ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలలు తెరచుకున్నాయి. తగినన్ని గదులు లేకపోవడంతో సగం తరగతులకే పాఠాలు నిర్వహించారు. నాగులాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉండగా సోమవారం ఆరు, ఎనిమిది, పది తరగతులకే క్లాసులు జరిగాయి. మంగళవారం ఏడు, తొమ్మిది, పది తరగతులు నిర్వహించడం జరుగుతుందని హెచ్ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. మునగపాక ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 430 మంది విద్యార్థులుండగా, 211 మంది వచ్చారు. మెలిపాక ప్రాథమికోన్నత పాఠశాలలో 74 మంది విద్యార్థులకు గాను 45 మంది హాజరయ్యారు.
రాంబిల్లి: మండలంలోని 58 ప్రభుత్వ పాఠశాలలను కొవిడ్ నిబంధనల మేరకు ప్రారంభమయ్యాయి. వీటిలో మొత్తం 5,112 మంది విద్యార్థులు ఉం డగా, తొలిరోజు కేవలం 1994 మంది మాత్రమే విచ్చేశారు. బుధవారం మంచి రోజు కనుక విద్యార్థుల సంఖ్య పెరగవచ్చునని ఉపాధ్యాయులు భావి స్తున్నారు. ఈ సందర్భంగా ఎంఈవో ఎం.సూర్యారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపాలని సూచించారు.