రేపట్నుంచి సీనియర్ సిటిజన్లకు తొలి డోసు టీకా
ABN , First Publish Date - 2021-05-18T05:51:59+05:30 IST
జిల్లా వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ను మంగళ వారం నిలిపివేయాలని నిర్ణయించారు.
నేడు టీకా పంపిణీ లేనట్టే
ఏలూరు ఎడ్యుకేషన్, మే 17: జిల్లా వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ను మంగళ వారం నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నిల్వ ఉన్న 58 వేల డోసుల కొవిషీల్డ్ తొలిడోసు పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తొలుత 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు బుధ, గురువారాల్లో కొవిషీల్డ్ తొలిడోసు టీకా మందు పంపిణీ జరగనుంది. అదే సమయంలో నిల్వ ఉన్న కొవాగ్జిన్ టీకా నిల్వలను ఎంపిక చేసిన సీవీసీలలో రెండో డోసు లబ్ధిదారులకు వేయనున్నారు. తొలిడోసు పంపిణీ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేయనున్నారు. కోవాగ్జిన్ రెండో డోసు లబ్ధిదారులకు సోమవారం జిల్లాలోని 14 వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకా మందు పంపిణీ జరిగింది. కాగా కొవిషీల్డ్ తొలి డోసు టీకా మందును భీమవరం, తణుకు, ఏలూరు డిపోల్లో ఆర్టీసీ కార్మికుల కోసం ప్రత్యేకంగా నిర్వహించారు.