మత్స్యకారులకు వేట నిషేధ భృతి
ABN , First Publish Date - 2021-05-18T05:47:33+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరైన్ రెగ్యులేషన్ చట్టం 1994 ప్రకారం సముద్రంలో యాంత్రిక, మర పడవల వేట నిషేధం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు (61 రోజులు) పాటు కొనసాగనుంది.
జిల్లాలో 14,263 ముంది అర్హులు
నేడు లబ్ధిదారుల ఖాతాకు రూ.14.263 కోట్లు జమ
నెల్లూరు(వెంకటేశ్వరపురం), మే 17: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరైన్ రెగ్యులేషన్ చట్టం 1994 ప్రకారం సముద్రంలో యాంత్రిక, మర పడవల వేట నిషేధం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు (61 రోజులు) పాటు కొనసాగనుంది. ఈ కాలంలో మత్స్యకారుల భృతికి ప్రభుత్వం ప్రతి ఏటా అర్హులైన మత్స్యకారుల ఖాతాల్లో నగదు వేస్తుంది. గతంలో రూ.4వేలు ఉన్న భృతిని రూ.10 వేలకు పెంచారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సముద్ర తీరప్రాంత పరిధిలోని కావలి, కోవూరు, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్టాల పరిధిలో అర్హులైన మత్స్యకారులు 14,263 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.14.263 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నగదు మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందరి ఖాతాల్లో జమ చేయనున్నారు.
జిల్లాలో నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల వివరాలు
సంఖ్య నియోజకవర్గం లబ్ధిదారుల సంఖ్య మొత్తం (రూ.కోట్లలో)
1. కావలి 5,198 5.198
2. కోవూరు 3,210 3.210
3. సర్వేపల్లి 2,076 2.076
4. గూడూరు 3,779 3.779
మొత్తం 14,263 14.263
పీఎంఎంఎస్వైకు రూ.5.80 కోట్లు
నెల్లూరు(వెంకటేశ్వరపురం), మే 17 : ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పఽథకం (పీఎంఎంఎస్వై) కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాకు రూ.5.80 కోట్లను సోమవారం మంజూరు చేసింది. దాదాపు 14 పథకాల అమలుకు శ్రీకారం చుట్టి రూ.11.61 కోట్ల కేటాయించగా మొదటి విడత రూ.5.80 కోట్ల విడుదల చేశారు. ఈ నిధులతో జిల్లాలో 14 రకాల పథకాలను మత్స్యకారుల కోసం అమలు పరచనున్నారు. అందుకు అర్హులైన 532 మంది మత్సకారులను ఇప్పటికే జిల్లా మత్స్యశాఖ ఎంపిక చేసింది. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పరచేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.