టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-11-26T09:52:08+05:30 IST
టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్టు
ఘటన వెనుక రాజకీయ కోణం లేదు: విశాల్ గున్నీ
గుంటూరు, నవంబరు 25: గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ కార్యకర్త షేక్ సైదాపై హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ గురువారం తెలిపారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాపై ఈ నెల 21న పట్టపగలు జాతీయ రహదారిపై రాడ్లు, రాళ్లతో వైసీపీ వర్గీయులు విచక్షణా రహితంగా దాడిచేసిన విషయం విదితమే. నడిరోడ్డుపై జరిగిన మూక దాడి దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘నడిరోడ్డుపై మూకదాడి’ శీర్షికన ప్రచురించిన కథనంపై విశాల్ గున్నీ స్పందించారు. సైదాపై హత్యాయత్నం చేసిన తుమ్మలచెరువు గ్రామానికి చెందిన తలకొల శివారెడ్డి, ఆయన అల్లుడు హేమంత్రెడ్డి, అల్లుడి తమ్ముడు అయ్యప్ప రెడ్డి, గోపాల్రెడ్డి, వేణులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని విశాల్ గున్నీ హామీ ఇచ్చారు. దాడి వెనుక రాజకీయ కోణం లేదని, కేవలం స్థల వివాదం నేపథ్యంలోనే దాడి జరిగినట్లు వెల్లడించారు.