రూ.5 కోట్లకు తగ్గేదేలే..
ABN , First Publish Date - 2022-01-21T08:21:04+05:30 IST
కరోనా కష్ట కాలంలోనూ ధనిక వర్గాలు దర్జాగా ఆస్తులు పోగేసుకుంటున్నారు. ధర విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అని అంటున్నారు....
రెండేళ్లలో కాస్ట్లీ ఇల్లు కొంటాం..
75% ధనికుల అభిమతమిదే జూ ఇండియా సోథెబీస్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా కష్ట కాలంలోనూ ధనిక వర్గాలు దర్జాగా ఆస్తులు పోగేసుకుంటున్నారు. ధర విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అని అంటున్నారు. వచ్చే రెండేళ్లలో ఏదైనా ప్రధాన నగరం లేదా ప్రముఖ పర్యాటక ప్రాంతంలో రూ.5 కోట్లకు పైగా విలువ చేసే స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటున్నారు. తమ తాజా సర్వేలో పాల్గొన్న ధనికుల్లో 75 శాతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారని ‘ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ’ వెల్లడించింది. లగ్జరీ రియల్టీ విభాగానికి చెందిన ప్రముఖ బ్రోకరేజీ సంస్థల్లో ఇండియా సోథెబీస్ ఒకటి. హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లోని లగ్జరీ రియల్టీ మార్కెట్లో కొనుగోలుదారుల వైఖరిని తెలుసుకునేందుకు 200కు పైగా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అలా్ట్ర హెచ్ఎన్ఐలను సర్వే చేసిందీ సంస్థ. వచ్చే రెండేళ్లలో స్థిరాస్తి కొనుగోలు చేసే ఉద్దేశం ఉందని సర్వేలో పాల్గొన్న మూడొంతుల మంది వెల్లడించారని రిపోర్టు పేర్కొంది. ధనిక వర్గాల్లో ప్రాపర్టీ కొనుగోలు ట్రెండ్ మున్ముందు బాగా పుంజుకోనుందనడానికి ఇదే సంకేతమని అభిప్రాయపడింది. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది గడిచిన ఏడాదిన్నరలో స్థిరాస్తి కొనుగోలు చేశారని నివేదిక తెలిపింది. తమ జీవనశైలిని మరింత మెరుగుపర్చుకోవడంతో పాటు సరైన పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకే ఈ కొనుగోలు జరిపినట్లు వారు తెలిపారు. కరోనా సంక్షో భం కంటే 2-3 ఏళ్ల ముందు హెచ్ఎన్ఐ, అలా్ట్ర హెచ్ఎన్ఐలు సొంత వినియోగానికి విలాస గృహాలు కొనుగోలు చేస్తూ వచ్చారని రిపోర్టు వెల్లడించింది.
స్థిరాస్తుల్లో ఏది కొనుగోలు చేయాలనుకుంటున్నారు..?
89% : విలాసవంతమైన ఇల్లు (అపార్ట్మెంట్, భవంతి, హాలీడే హోమ్)
11% : ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీ