లక్షణాల్లేవు...అయినా పాజిటివ్!
ABN , First Publish Date - 2020-04-02T09:20:25+05:30 IST
పొడి దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం...ఇవీ కరోనా వైరస్ బారినపడిన వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు.
ఐదు పాజిటివ్ కేసుల్లో నలుగురిలో కనిపించని వైరస్ లక్షణాలు
అధికార యంత్రాంగంలో టెన్షన్
ఇప్పటివరకు పరీక్షలు చేస్తున్న వైద్యులు
ఇకపై అనుమానిత లక్షణాలున్న అందరికీ పరీక్షలు నిర్వహించాల్సిందేనా..?
ఢిల్లీ కనెక్షన్ ఉన్నవారిలో మాత్రమే కనిపించిన ఈ పరిస్థితి
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): పొడి దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం...ఇవీ కరోనా వైరస్ బారినపడిన వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెబుతూ వస్తున్నారు. అయితే ఈ లక్షణాలేవీ కనిపించకపోయినా వైరస్ బారినపడేందుకు అవకాశం ఉందా?...అంటే ఇప్పటివరకు అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. అందుకే ఈ విషయం గురించి వైద్య నిపుణులు పెద్దగా చర్చించలేదు. కానీ జిల్లాలో కొత్తగా నమోదైన ఐదు పాజిటివ్ కేసులను పరిశీలిస్తే...ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుందేమో. ఎందుకంటే మంగళ, బుధవారాల్లో వైరస్ బారినపడినట్టు తేలిన ఐదుగురిలో నలుగురికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. ఇది వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు వైద్యులు కూడా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు వున్న వారికి మాత్రమే పరీక్షలను చేస్తూ వస్తున్నారు. లక్షణాలు లేని వ్యక్తులను కొద్దిరోజులపాటు పరిశీలనలో వుంచి డిశ్చార్జి చేసేస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన మత సమావేశంలో పాల్గొని నగరానికి వచ్చిన 35 మందిని వైద్యులు మూడు రోజుల కిందట ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. పరీక్షల నిమిత్తం నమూనాలు తీసి పంపించారు. అయితే వీరంతా ఢిల్లీ నుంచి వచ్చి పది రోజులు దాటుతుండడం, ఎవరిలోనూ వైరస్ సోకిన లక్షణాలు కనిపించకపోవడంతో పాజిటివ్ కేసులు వుండవని భావించారు. వీరిలో మంగళవారం రాత్రి కొందరివి, బుధవారం ఉదయం మరికొందరివి రిపోర్ట్సు వచ్చాయి. అందులో ఐదుగురు వైరస్ బారినపడినట్టు తేలింది. ఐదుగురిలో ఒక వృద్ధుడు (70) మాత్రమే ఒళ్లు నొప్పులతో బాధపడుతుండగా, మిగిలిన నలుగురిలో ఎటువంటి లక్షణాలు లేకపోగా ఆరోగ్యంగా కనిపించారు. అయినా వైరస్ బారినపడడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై వైద్యాధికారులను ఆరా తీయగా కొంతమందిలో వైరస్ వున్నా లక్షణాలు కనిపించేందుకు ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు.