ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-07-25T04:54:07+05:30 IST
ఖాజీపేట మండలం నాగపట్నం గ్రామానికి తూర్పు వైపు అడవి ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు అక్రమంగా న రికి దుంగలుగా మార్చి వాహనంలోకి లోడ్ చేస్తుండగా ఖాజీపేట పోలీసులు ఐదుగురు స్మగ్ల్లర్లను అరెస్టు చేశారు.
20 దుంగలు, కారు స్వాధీనం : ఎస్పీ అన్బురాజన్
కడప (క్రైం), జూలై 24 : ఖాజీపేట మండలం నాగపట్నం గ్రామానికి తూర్పు వైపు అడవి ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు అక్రమంగా న రికి దుంగలుగా మార్చి వాహనంలోకి లోడ్ చేస్తుండగా ఖాజీపేట పోలీసులు ఐదుగురు స్మగ్ల్లర్లను అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ఓఎస్డీ దేవప్రసాద్, మైదుకూరు డీఎస్పీ విజయకుమార్, మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, ఖాజీపేట ఎస్ఐ కుళ్లాయప్పతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. ఖాజీపేట మండలం నాగపట్నంకు చెందిన మేకల అల్లూరయ్య, మేకల రోషయ్య, గోపవరం మండలం లక్కవారిపల్లెకు చెందిన కప్పల శ్రీరామ్, అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన తిరుపతి, అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు కొండ కొమెర్లకు చెందిన బి.మధు ప్రస్తుతం రాయచోటి హనుమపల్లెలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఈ ఐదుగురు మరికొందరితో కలిసి శనివారం ఖాజీపేట మండలం నాగపట్నం గ్రామం సమీపంలోని ఫారెస్టు ఏరియాలో ఇన్నోవా వాహనంలోకి ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. మైదుకూరు డీఎస్పీ, రూరల్ సీఐ, ఖాజీపేట ఎస్ఐ ఆధ్వర్యంలో ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 446 కేజీల బరువు ఉన్న 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా స్వాధీనం చేసుకున్నట్లు తె లిపారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ పుల్లయ్య పాల్గొన్నారు.
కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాతో పాటు తమిళనాడు, కర్నాటకకు చెందిన పలువురు స్మగ్లర్లను అరెస్టు చేశామని, అలాగే పలువురు స్మగ్లర్లపై పీడీ యాక్టు కూడా నమోదు చేశామన్నారు.
సుండుపల్లెలో 14 దుంగలు స్వాధీనం
సుండుపల్లె, జూలై 24: ముడుంపాడు బీట్ రాయవరం సెక్షన్ స్వర్ణదేవరదారి ప్రదేశంలో శనివారం 14 ఎర్రచందనం దుంగలను స్వాధీన పర్చుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు సానిపాయి ఎఫ్ఆర్వో పీరయ్య తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న రాజంపేట డీఎ్ఫవో సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు చేశామన్నారు. 14 ఎర్రచందనం దుంగలతో పాటు తమిళనాడు రాష్ట్రం తిరుమలై జిల్లాకు చెందిన డి.శివకుమార్, ఆర్.దేవదాసన్లను అరెస్టు చేశామన్నారు. దాడుల్లో రాయవరం డీవైఆర్వో ఎం.శేషయ్య, సుండుపల్లె ఎఫ్బీవో ఎస్.నాగేశ్వరరావు, ముడుంపాడు ఎఫ్బీవో పి.చెంగమ్మ, ఫారెస్టు ప్రొటెక్షన్ వాచర్లు, సిబ్బంది పాల్గొన్నామన్నారు.