ఆతిథ్యానికి పచ్చ జెండా!
ABN , First Publish Date - 2020-06-05T09:11:04+05:30 IST
నగర పరిధిలో ఫైవ్ స్టార్ హోటల్స్ మొదలు కొని లాడ్జిల వరకూ మొత్తం ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి.
రెండున్నర నెలలుగా మూత పడిన ఆతిథ్యరంగం ఎట్టకేలకు పునఃప్రారంభం కానుంది. జూన్ 8వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హోటళ్లు లాడ్జీలు, కాటేజీలు తెరుచుకోనున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే హోటళ్లు, లాడ్జిలు, కాటేజీల్లో రూమ్లు బుక్ చేసుకోవచ్చు. కొవిడ్ - 19 ను దృష్టిలో ఉంచుకుని అతిథ్య రంగం యావత్తూ ఆన్లైన్ బుకింగ్లకు శ్రీకారం చుట్టనుంది. హోటళ్లలోని కాన్ఫరెన్స్ హాల్స్, ఫంక్షన్ హాల్స్లో సగం మందిని మాత్రమే అనుమతించనున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నగర పరిధిలో ఫైవ్ స్టార్ హోటల్స్ మొదలు కొని లాడ్జిల వరకూ మొత్తం ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. నగరంలోని స్టార్ హోటల్ ఆక్యుపెన్సీ కరోనాకు ముందు 70 శాతం పైన ఉండేది. ఫైవ్స్టార్ హోటల్స్గా ఉన్న నోవాటెల్, గేట్వే, ఫోర్ స్టార్ హోటల్స్గా ఉన్న డీవీ మానర్, మురళీ ఫార్చ్యూన్ పార్క్లతో పాటు ఐలాపురం, మార్గ్ కృష్ణాయ, ఇన్నోటెల్, మమత, స్వర్ణ హోటల్, ఎం హోటల్స్, ఓయో హోటల్స్ వంటివి అనేకం ఎప్పుడూ బిజీగా ఉండేవి. ఇవన్నీ సుదీర్ఘ కాలం తరువాత పునఃప్రారంభం కానున్నాయి.
అయితే కరోనా కారణంగా ఇంతకు పూర్వం ఉన్న డిమాండ్ ఇప్పుడు ఉండే అవకాశం లేదు. పునఃప్రారంభం తరువాత ఒక్కసారిగా వ్యాపారం ఉంటుందని భావించలేమని హోటళ్ల నిర్వాహకులు అంటున్నారు. వ్యాపారం నిర్వహించాలి కాబట్టి.. ఆశావహ దృక్పథంతో తిరిగి తెరిచేందుకు సన్నద్ధమౌతున్నామని చెబుతున్నారు.
అందుబాటులోకి పర్యాటక కాటేజీలు
పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కాటేజీలు కూడా జూన్ ఎనిమిది నుంచి అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో ప్రధానంగా భవానీ ఐల్యాండ్, హరిత బెర్మ్పార్క్ లలోని కాటేజీలు తెరుచుకుంటున్నాయి. ఈ కాటేజీలకు శుక్రవారం నుంచి ఆన్లైన్ బుకింగ్ను ప్రారంభించనున్నారు. పర్యాటకులకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఏపీటీడీసీ బోటింగ్ యూనిట్ను కూడా ప్రారరంభించనున్నారు.
బోటింగ్ కేవలం పర్యాటక కాటేజీలను బుక్ చేసుకున్న వారిని చేరవేయటం కోసమే ప్రారంభిస్తున్నారు. కొవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య రంగాన్ని పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి జగన్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించనున్నారు. అలాగే.. బోటింగ్ను కూడా ప్రారంభించనున్నట్టు సమాచారం.