విడిపోయి ఐదేళ్లయినా ఉమ్మడి విద్యాధికారేనా?
ABN , First Publish Date - 2021-10-27T04:50:37+05:30 IST
ఉమ్మడి దౌల్తాబాద్ మండలాన్ని విభజించి, రాయపోల్ కేంద్రంగా నూతన మండలాన్ని ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. మండల విద్యాశాఖ మినహా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని విభజించి రాయపోల్ మండల కేంద్రంలో అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు.
రాయపోల్ మండలంలో పాఠశాలల పర్యవేక్షణకు తప్పని ఇబ్బందులు
కార్యాలయం ఉన్నా ప్రారంభించని వైనం
రాయపోల్, అక్టోబరు 26: ఉమ్మడి దౌల్తాబాద్ మండలాన్ని విభజించి, రాయపోల్ కేంద్రంగా నూతన మండలాన్ని ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. మండల విద్యాశాఖ మినహా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని విభజించి రాయపోల్ మండల కేంద్రంలో అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు. అయితే రాయపోల్ మండలంలో 19 ప్రాథమిక పాఠశాలు, 4 ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 ఉన్నత పాఠశాలు ఉన్నాయి. వీటితో పాటు కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాల కూడా ఉన్నది. మండలంలో మొత్తం 3,195 విద్యార్థులు, 132 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. మండల విద్యాధికారి కార్యాలయాన్ని మాత్రం దౌల్తాబాద్ కేంద్రంగానే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మండలానికి ఒకే విద్యాధికారి ఉండడంతో పాఠశాలల పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. కరోనా ప్రభావంతో ఏడాదికిపైగా మూతపడిన విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. రాయపోల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో నిర్వహించే సమావేశాలు, శిక్షణా తరగతులను దౌల్తాబాద్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో విద్యాబోధనకు అంతరాయం ఏర్పడడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.
రూ.30లక్షలతో భవన నిర్మాణం
ఇదిలా ఉండగా అప్పటి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృషితో ప్రభుత్వం రాయపోల్లో మండల వనరుల కేంద్ర భవన నిర్మాణం కోసం నిధులను కేటాయించింది. ఆర్వీఎం ఆధ్వర్యంలో మండల వనరుల కేంద్ర భవనాన్ని రాయపోల్లోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించారు. సుమారు రూ.30లక్షలతో అధునాతన సదుపాయలతో భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కానీ మండల విద్యాధికారి లేకపోవడంతో ఆ భవనం ప్రారంభానికి నోచుకోలేదు.