నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-03-23T05:56:15+05:30 IST

రామగుండం నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పలువురు మంత్రులను కలిసి విన్నవించారు.

నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి
మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

- మంత్రులను కలిసిన రామగుండం ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, మార్చి 22: రామగుండం నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పలువురు మంత్రులను కలిసి విన్నవించారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి, ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. కుందనపల్లి గ్రా మాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, ఎన్‌టీపీసీ యాష్‌పాండ్‌ మూలంగా కుందనపల్లి గ్రామస్థులు కాలుష్య కోరల్లో చిక్కుకుని అనారోగ్యంతో బాధపడుతున్నారని, గ్రామాన్ని ఇతర చోటుకు తరలించి పునరావాసం కల్పించాలని కోరారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో గ్యాస్‌ లీకేజీతో రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్యాస్‌ లీకేజీతో విష వాయువులు గాలిలో కలిసి ఘాటైన విషవాయువులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు గోదావరినదిలో కలుస్తున్నాయని, దీంతో అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందన్నారు. 

పర్యాటక కేంద్రానికి నిధులు ఇవ్వండి

రామగుండాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్యే చందర్‌ కోరారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం, చిల్డ్రన్‌ పార్కు నిర్మించాలని, బోటుకు మరమ్మతులు చేసి గోదావరినదిలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-03-23T05:56:15+05:30 IST