Turkey : వరదల్లో 77 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2021-08-17T12:42:35+05:30 IST
టర్కీ దేశంలోని నల్ల సముద్రతీరంలో సంభవించిన వరదల్లో 77 మంది దుర్మరణం చెందారు....
అంకారా (టర్కీ): టర్కీ దేశంలోని నల్ల సముద్రతీరంలో సంభవించిన వరదల్లో 77 మంది దుర్మరణం చెందారు. వాయువ్య నల్ల సముద్రం ప్రావిన్సులో కురిసిన కుండపోత వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. వరదనీటి ధాటికి పలు ఇళ్లు, వంతెనలు కుప్పకూలిపోయాయి. వరదనీటిలో కార్లు కొట్టుకుపోయాయి.కాస్టామోను ప్రావిన్స్లో కనీసం 62 మంది మరణించారు. సినోప్లో 14 మంది, బార్టిన్లో ఒకరు మరణించారని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు.కాస్టామోను, సినోప్ ప్రాంతాల్లో పలువురు గల్లంతు అయ్యారు.
8 వేల మంది సహాయ సిబ్బంది వరదసహాయ పునరావాస పనులు చేపట్టారు. 40 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీవర్షాల వల్ల నల్లసముద్రం ఉత్తర తీరంలో 1500 మందిని ఖాళీ చేయించారు. వరదప్రాంతాల్లో చిక్కుకున్న 2,400 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణ మార్పులు, కార్చిచ్చు, తుపాన్లు, భారీవర్షాలతో టర్కీ దేశం అతలాకుతలమైంది.