TRS మహిళా ఎంపీ - ఎమ్మెల్యే మధ్య ఫ్లెక్సీల రగడ.. అర్ధరాత్రి హల్చల్!
ABN , First Publish Date - 2021-10-15T17:19:30+05:30 IST
అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య గొడవలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి...
మహబూబాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య గొడవలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో డివిజిన్ కమిటీల ఎంపికలో పెద్ద రాద్ధాంతమే జరిగిన విషయం తెలిసిందే. దీంతో స్వయంగా మంత్రి కేటీఆరే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి రాగా.. ప్రస్తుతం అవన్నీ సర్దుకున్నాయ్. అయితే ఇది మరిచిపోక మునుపే మహబూబాబాద్లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది. బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ కవిత వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎంపీ అనుచరులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు అయ్యింది. అంతేకాదు.. అర్ధరాత్రి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. 8 మంది పరారీలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తన వాళ్లను విడిచిపెట్టాలంటూ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి 2 గంటల పాటు హల్ చల్ చేశారు.
ఏంటిది..!?
సీఐ తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ఒకింత ఆవేదనకు లోనయ్యారు. తన ఇంటిపై దుండగులు దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? అని శంకర్ నాయక్ ప్రశ్నించారు. మరోవైపు.. ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని కూడా శంకర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ వ్యవహారానికి ఎలా ఫుల్స్టాప్ పెడతారో వేచి చూడాలి.