Etihad Airways: భారత్ నుంచి అబుధాబికి మరిన్ని విమానాలు!
ABN , First Publish Date - 2021-08-06T18:08:47+05:30 IST
యూఏఈ వెళ్లాలనుకుంటున్న భారతీయులకు గుడ్న్యూస్. ఆగస్టు 7 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన యూఏఈ నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్వేస్... భారత్లోని మూడు నగరాల నుంచి అబుధాబికి మరిన్ని విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ: యూఏఈ వెళ్లాలనుకుంటున్న భారతీయులకు గుడ్న్యూస్. ఆగస్టు 7 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన యూఏఈ నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్వేస్... భారత్లోని మూడు నగరాల నుంచి అబుధాబికి మరిన్ని విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఆగస్టు 10 నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే ట్రాన్సిట్ ప్రయాణికుల కోసం పాకిస్తాన్లోని మూడు నగరాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి కూడా విమాన సర్వీసులు నడిపిస్తామని ఎతిహాద్ తెలియజేసింది.
ఆగస్టు 7 నుంచి 9 మధ్య చెన్నై, కొచ్చి, బెంగళూరు, త్రివేండ్రం, న్యూఢిల్లీ నుంచి అబుధాబికి విమాన సర్వీసులు ఉంటాయని ఎతిహాద్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. అలాగే ఆగస్టు 10 నుంచి అహ్మదాబాద్(ట్రాన్సిట్కు మాత్రమే), హైదరాబాద్, ముంబై నుంచి విమాన సర్వీసులు ఉండనున్నాయి. ఇక పాక్లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్తో పాటు బంగ్లాదేశ్లోని ఢాకా, శ్రీలంక రాజధాని కొలంబో నుంచి కూడా ఇదే రోజున విమానాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కాగా, అబుధాబి చేరుకున్న తర్వాత ప్రయాణికులు 10 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని చెప్పింది. అలాగే ప్రయాణికులు జర్నీకి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపించడం కూడా తప్పనిసరి.