నిధుల వరద
ABN , First Publish Date - 2021-12-06T05:57:03+05:30 IST
నిధుల వరద
- స్థానిక సంస్థలకు నిధులు విడుదల
- ఉమ్మడి జిల్లాకు రూ.21.88 కోట్లు
- జిల్లా ప్రజా పరిషత్లకు రూ.11.03 కోట్లు
- మండల ప్రజా పరిషత్లకు రూ. 10.86 కోట్లు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్/ఆంధ్రజ్యోతి, వికారాబాద్ జిల్లా ప్రతినిధి) : స్థానిక సంస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లా ప్రజాపరిషత్లకు, మండల ప్రజాపరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్లకు కలుపు కుని రూ.21.88 కోట్లు ఇచ్చింది. ఇందులో జడ్పీకి రూ.11.03 కోట్ల నిధులు విడుదల చేయగా, మండల ప్రజాపరిషత్లకు రూ.10.86 కోట్లు విడుదల చేశారు. వీటితో స్థానిక సంస్థల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరగనున్నాయి. సాధారణ నిధులను ప్రజల మౌలిక సదు పాయాల కల్పన కోసం వినియోగించనున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద విడుదలైన నిధులను ఎస్సీ, ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు, అండర్డ్రైనేజీ, అదనపు తరగతుల నిర్మాణం తదితర అవసరాలకు ఖర్చు చేయనున్నారు.
జిల్లా పరిషత్లకు విడుదలైన నిధులు (రూ.కోట్లలో)
జిల్లా సాధారణ ఎస్సీఎస్పీ టీఎస్పీ మొత్తం
రంగారెడ్డి 4.10 0.94 0.40 5.44
వికారాబాద్ 3.58 0.81 0.35 4.75
మేడ్చల్ 0.68 0.13 0.03 0.84
మండల పరిషత్లకు విడుదలైన నిధులు (రూ.కోట్లలో)
జిల్లా సాధారణ ఎస్సీఎస్పీ టీఎస్పీ మొత్తం
రంగారెడ్డి 4.05 0.93 0.39 5.37
వికారాబాద్ 3.53 0.79 0.35 4.67
మేడ్చల్ 0.67 0.13 0.03 0.82
నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉంది: తీగల అనితాహరినాథ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్
జిల్లాపరిషత్, మండల పరిషత్లకు నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. జిల్లా పరిషత్కు రూ.5.44 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తుంది. విడతల వారీగా నిధులను మంజూరు చేస్తుంది. ప్రజా సమస్యల పరిస్కారానికి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. మంజూరైన నిధులతో ప్రజల మౌళిక వసతులు కల్పించనున్నాము.
ప్రజావసరాల కోసం ఖర్చు పెట్టనున్నాం: హరీష్కుమార్, ఎంపీడీవో
మండల పరిషత్కు మంజూరైన నిధులతో మండలంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేయనున్నాం. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఈ నిధులు విడుదల చేస్తుంది. జనాభా ప్రాతిపదికన నిధులు విడుదలవుతు న్నాయి. గ్రామ పంచాయతీల్లో అత్యవసర పనులు కూడా చేసుకునే అవకాశముంది. ముఖ్యంగా పారిశుధ్య, తాగునీరు వంటి వాటికి ప్రాధాన్యమివ్వనున్నాం.
రాష్ట్ర సర్కార్ నిధులు ఇవ్వడం సంతోషకరం: చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు
స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలని మూడేళ్లుగా పోరాటం చేస్తున్నాం. నిధులు విడుదల కోసమే పంచాయతీ రాజ్ ఛాంబర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శైలజారెడ్డిని ఎమ్మెల్సీ బరిలో ఉంచాం. అభ్యర్థులు మహేందర్రెడ్డి, శంబీపూర్రాజు దొడ్డిదారిన గెలిచారు. ఏదిఏమైనా నిధుల కోసం చేస్తున్న పోరాటానికి కొంత ఫలితం దక్కింది. ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేయాలి. కానీ.. రూ.250 కోట్లు ఇవ్వడం సంతోషమే. మిగతా రూ.250 కోట్లు వెంటనే విడుదల చేయాలి.