కృష్ణమ్మ పరుగులు

ABN , First Publish Date - 2021-07-24T06:49:22+05:30 IST

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరుగులెడుతోంది.

కృష్ణమ్మ పరుగులు

బ్యారేజీకి 1.10 లక్షల క్యూసెక్కుల వరద

మొత్తం గేట్లను ఎత్తిన అధికారులు


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరుగులెడుతోంది. కీసర, మునేరు వాగులు వేగంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం నుంచి ఉధృతంగా ఉన్న ప్రవాహం శుక్రవారం రాత్రికి తగ్గడం మొదలైంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 65 వేల క్యూసెక్కులు, కీసర, మునేరు వాగుల నుంచి 95 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకు వస్తోంది. వెరసి 1.10లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి అధికారులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పది గేట్లను మూడు అడుగుల మేర, 60 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. పై నుంచి వస్తున్న నీటిని మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. మునేరు వాగుకు వరద సాయంత్రం నుంచి నెమ్మదిగా తగ్గడం మొదలైంది. రాత్రి ఏడు గంటలకు 44,627 క్యూసెక్కులకు తగ్గింది. శనివారం ఉదయానికి వాగుల్లో వరద ఉధృతి మరింతగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ నుంచి దిగువకు వదులుతున్న నీటిలో 1,500 క్యూసెక్కులను కాల్వలకు ఇస్తున్నారు. 1.10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లడంతో పరివాహక ప్రాంతంలో జలకళ కనిపిస్తోంది. 

Updated Date - 2021-07-24T06:49:22+05:30 IST