రూ.15 కోట్ల విలువైన సొత్తు దొరికింది.. యజమానులు ముందుకు వస్తే చాలు, అంతా మేం చూసుకుంటాం.. పోలీసుల ప్రకటన వైరల్

ABN , First Publish Date - 2021-10-12T03:38:20+05:30 IST

తనిఖీల్లో భాగంగా రెండు మిలియన్ డాలర్ల(దాదాపు రూ.15 కోట్ల) విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న ఫ్లోరిడా రాష్ట్ర(అమెరికా) పోలీసులు.. వీటి యజమానులు ముందుకు రావాలని కోరుతూ ఫేస్‌బుక్‌లో చేసిన ఓ ఫన్నీ ప్రకటన ప్రస్తుతం అమెరికాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రూ.15 కోట్ల విలువైన సొత్తు దొరికింది.. యజమానులు ముందుకు వస్తే చాలు, అంతా మేం చూసుకుంటాం.. పోలీసుల ప్రకటన వైరల్

ఇంటర్నెట్ డెస్క్: తనిఖీల్లో భాగంగా రెండు మిలియన్ డాలర్ల(దాదాపు రూ.15 కోట్లు) విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న ఫ్లోరిడా రాష్ట్ర(అమెరికా) పోలీసులు.. వీటి యజమానులు ముందుకు రావాలని కోరుతూ ఫేస్‌బుక్‌లో చేసిన ఓ ఫన్నీ ప్రకటన ప్రస్తుతం అమెరికాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీ పోలీసులు  దాదాపు 350 కిలోల గంజాయిని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఇటువంటి మాదకద్రవ్యాల వినియోగం, అమ్మకం, పంపిణీ చట్టరీత్యా నేరం అని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, చట్టం పట్ల భయభక్తులను పెంచేందుకు ఫేస్‌బుక్‌లో  చమత్కారంగా ఓ పోస్ట్ పెట్టారు. 


‘‘దీన్ని పోగొట్టుకున్న వారు తమ ఆస్తిని తిరిగి పొందాలనుకుంటే మా నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బందిని వెంటనే సంప్రదించండి. వెంటనే మేము మిమ్మల్ని, మీ సొత్తును ఏకం చేస్తాం. విలువైన వాటిని పోగొట్టుకోవడం జరిగేదే.. అందులో తప్పులేదు. అయితే.. మా పోలీసు శాఖ నిత్యం ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి.. ఈ సొత్తుకు నిజమైన హక్కుదారుడు ముందుకు రావాలని అభ్యర్ధిస్తున్నాం. మిమ్మల్ని, మీ ఆస్తిని సురక్షితంగా ‘ఒక చోటుకు’ చేర్చేందుకు, మళ్లీ మీరు ఇతరుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం. దయచేసి ఈ ఆస్తికి నిజమైన హక్కుదారులు ముందుకు రావాలని మనవి’’ అంటూ అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఓ అద్భుతమైన పోస్ట్ పెట్టింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-10-12T03:38:20+05:30 IST