కరోనా సోకిన భార్యను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లి..

ABN , First Publish Date - 2020-08-09T09:08:19+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం శ్యామ్ రెక్ అనే 90 ఏళ్ల వృద్దుడు కరోనా కారణంగా

కరోనా సోకిన భార్యను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లి..

ఆర్లాండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం శ్యామ్ రెక్ అనే 90 ఏళ్ల వృద్దుడు కరోనా కారణంగా మరణించాడు. ఇందులో వింత ఏం లేకపోయినప్పటికి.. ఆయనకు అసలు కరోనా ఎలా సోకిందో తెలిస్తే ఆవేదన చెందుతారు. శ్యామ్ రెక్ భార్య జోవాన్ రెక్(86) కరోనా బారిన పడి జూలై 12న మరణించింది. జోవాన్ రెక్ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో ఆమెను ఒక్కసారైనా చూసి తీరాల్సిందేనని శ్యామ్ రెక్ పట్టుబట్టాడు. ఈ వయసులో కరోనా సోకిన వారి వార్డుకు వెళ్లడం మంచిది కాదని కుటుంబసభ్యులు వాదించినా శ్యామ్ వినిపించుకోలేదు. ఆసుపత్రికి వెళ్లి తన భార్య చికిత్స పొందుతున్న గదికి వెళ్లి ఆమెను ప్రేమగా పలకరించి ఆమెకు ధైర్యం చెప్పాడు. అయితే కొద్ది రోజులకు శ్యామ్‌కు కూడా కరోనా సోకినట్టు తేలింది. తన భార్యను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లడం వల్లే శ్యామ్‌కు కరోనా సోకి ఉంటుందని అందరూ భావించారు. ఆసుపత్రికి వెళ్లినందుకే కరోనా వచ్చిందని బాధపడుతున్నావా అంటూ శ్యామ్‌ను తన కూతురు హోలీ రెక్ అడగ్గా.. ఒక్క సెకను కూడా బాధపడలేదంటూ టక్కున సమాధానమిచ్చాడు. ఇక జూలై 12న తన భార్య చనిపోవడంతో.. శ్యామ్ ఒంటరి వాడైపోయాడు. ఒకపక్క కరోనాతో పోరాడుతూ.. మరోపక్క తన భార్య చనిపోయిందనే బాధతో కుమిలిపోయాడు. తన భార్య చనిపోయిన మూడు వారాల తర్వాత శనివారం తాను కూడా ప్రాణాలు విడిచాడు. శ్యామ్ తన భార్యను చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన నాటి నుంచి ఆసుపత్రిలో ఈ జంటను రోమియో, జూలియెట్ అని పిలవడం మొదలుపెట్టారు. చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్లే భార్యాభర్తలు ఈ 90 ఏళ్ల జంటను ఆదర్శంగా తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Updated Date - 2020-08-09T09:08:19+05:30 IST