పొదుపు, పెట్టుబడులపై దృష్టి
ABN , First Publish Date - 2021-01-20T08:59:59+05:30 IST
కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత నగరాల ప్రజలు పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెంచారని, విలాస ఖర్చులను గణనీయంగా తగ్గించుకున్నారని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక వెల్లడించింది.
విలాస ఖర్చులకు కత్తెర ..
కరోనా సంక్షోభమే కారణం
నగర ప్రజలపై మ్యాక్స్ లైఫ్ సర్వే
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత నగరాల ప్రజలు పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెంచారని, విలాస ఖర్చులను గణనీయంగా తగ్గించుకున్నారని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక వెల్లడించింది. వైరస్ సోకుంతుందన్న భయాలతోపాటు వైరస్ సోకితే చికిత్సకయ్యే ఖర్చులు, ఇంటి పెద్దదిక్కు అకాల మరణం, ఆర్థిక భద్రత వంటి ఆందోళనలు నగర ప్రజల్లో ఇంకా కొనసాగుతున్నాయని రిపోర్టు పేర్కొంది. 6 మెట్రో నగరాలతోపాటు 9 ప్రథమ శ్రేణి నగరాలు, 10 ద్వితీయ శ్రేణి నగరాలకు చెందిన 4,357 మందిని సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్లు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో నగర నివాసుల్లో ఆర్థిక భద్రత, అనిశ్చితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధత విషయంలో చింత పెరిగిందని సర్వే పేర్కొంది. కరోనా, అకాల ఖర్చులను తీర్చగలిగే ఆర్జన సామర్థ్యం లేకపోవడం అతిపెద్ద ఆందోళనలుగా మారాయని తెలిపింది.