ఆరుతడి పంటలపై దృష్టి సారించండి
ABN , First Publish Date - 2021-12-08T05:05:23+05:30 IST
రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలపై దృష్టిసారించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు.
- కలెక్టర్ ఆర్వీ కర్ణన్
గంగాధర, డిసెంబరు 7: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలపై దృష్టిసారించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం గంగాధర మండలం బూరుగుపల్లిలో అజయ్రావు అనే రైతు సాగుచేస్తున్న మినుము, బీర, టమాట పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఎత్తివేస్తున్నందున పప్పు దినుసులు, కూరగాయల పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. వరికి బదులు మార్కెట్లో డిమాండు ఉన్న ప్రజలకు అవసరమయ్యే ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేస్తున్న మినుము, టమాట, బీరా పంటలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వివరాలను మండలాధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఏవో శ్రీధర్, ఉద్యావన శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, ఏడీఏ రామారావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్రావు, ఏవో రాజు, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు పుల్కం గంగన్న, సర్పంచ్ సాగి రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మహిపాల్రావు, రైతులు పాల్గొన్నారు.
- నెలాఖరుకు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి
వాక్సినేషన్ ప్రక్రియ డిసెంబరు చివరి నాటికి వంద శాతం పూర్తి చేయాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మీక తనిఖీ చేశారు. రోజులు మొదటి, రెండో డోసు ఎన్ని సెంటర్లలో వేస్తున్నారు.. ఎంద మందికి వేయాల్సి ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా పరీక్షలు పెంచాలని, రోజుకు ఎన్ని టెస్టులు చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డాక్టర్ ఉషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.