కారు ప్రమాదంలో వీధి కుక్క మృతి
ABN , First Publish Date - 2021-01-14T07:06:18+05:30 IST
వీధి కుక్కను కారుతో ఢీ కొట్టి దాని మరణాని కి కారణమైన ఒకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు
బంజారాహిల్స్,
జనవరి 13 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కను కారుతో ఢీ కొట్టి దాని మరణాని కి
కారణమైన ఒకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు నంబర్
24లో జంతు ప్రేమికురాలు ప్రతిమాసాగర్ ఎప్పటిలాగే పనులు చేసుకుంటుండగా,
ఇంటి ముందు నుంచి ఓ కారు వేగంగా వెళ్తూ వీధి కుక్కను ఢీ కొట్టింది. దీంతో
కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. కారు ఆగకుండా వెళ్లి పోయింది.
ప్రతిమాసాగర్ ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ
సెక్షన్ 429తోపాటు సెక్షన్ 11 కింద కేసులు నమోదు చేసి, సీసీ పుటేజీలను
పరిశీలిస్తున్నారు.
నకిలీ వకీల్ సాబ్
గుట్టు రట్టు చేసిన క్లయింట్
కొత్తపేట, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానానికి చెందిన నకిలీ ఉత్తర్వులు సృష్టించి మోసం చేసిన నకిలీ న్యాయవాదిని బుధవారం ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కర్ణాటక రాయిచూర్, శివ్రాజ్ కాం పౌండ్కు చెందిన ప్రభాకర్ శివ్రాజ్ సంపతి అలియాస్ పి. శివ్రాజ్ (55) సైదాబాద్ సుబ్రమణ్యనగర్ కాలనీలో ఉంటూ న్యాయవాదిగా చెలామణి అయ్యేవాడు. దిల్సుఖ్నగర్ పీఅండ్టీ కాలనీలో ఉండే జి. శ్యాంసుందర్కు చెంగిచర్లలో ఓపెన్ప్లాట్లు, శైలజ ప్రిమియర్ అపార్టుమెంట్కు సబంధించిన షాపు లు ఉన్నాయి. సదరు షాపులు, ప్లాట్కు సంబంధించి వివాదా లు ఉండటంతో ఆయన పి. శివ్రాజ్ ద్వారా గతేడాది జులై 20న రంగారెడ్డి జిల్లా కోర్టులను ఆశ్రయించారు. కొన్నాళ్లకు శ్యాంసుందర్ కేసుకు సంబంధించి శివ్రాజ్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చా డు. తర్వాత అవి నకిలీవని తేలడంతో శ్యాంసుందర్.. శివ్రాజ్ను ప్రశ్నించాడు. దీంతో తప్పుని శివరాజ్ అంగీకరించాడు. పలు ఫీజుల కింద శివ్రాజ్కు చాలాసార్లు డబ్బులు చెల్లించానని, న్యాయం చేయాలని బాధితుడు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలంగాణ హైకోర్టు బార్కౌన్సిల్ను సంప్రదించారు. దీంతో శివ్రాజ్ న్యాయవాది కాదని తేలింది. నిందితుడు నకిలీ ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చాడని సైబరాబాద్ జేఎ్ఫఎం ప్రత్యేక మొబైల్ కోర్టు కం 6వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కం 6వ అడిషనల్ ఎంఎం కోర్టు నివేదిక ఇచ్చింది. ఆధారాలను సేకరించిన అనంతరం నిందితుడు శివ్రాజ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్హెచ్ఓ అశోక్రెడ్డి తెలిపారు.
సాయం అన్నారు.. మాయ చేశారు..
ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఆనంద్బాగ్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): పని మీద బైక్పై బయటికి వెళ్లిన ఒకరు దారిలో ఆనారోగ్యానికి గురయ్యారు. అతడికి సాయం చేస్తామని వచ్చిన ఇద్దరు బైక్తో ఉడాయించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను బుధవారం మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటేశ్వరనగర్కు చెందిన గురు యోగేశ్వర్ రైల్వే ఉద్యోగి. పటేల్నగర్లో పని ముగించుకుని వెళ్తూ మార్గమధ్యంలో అనారోగ్యంతో తన ద్విచక్రవాహనాన్ని(టీఎస్08 ఎఫ్టీ 2660) శ్రీదేవి ఫంక్షన్ హాలు వద్ద నిలిపి, విశ్రాంతి తీసుకుంటున్నాడు. గమనించిన పటేల్నగర్కు చెందిన పస్తమొల్ల మల్లేశ్(29), దుర్గానగర్కు చెందిన బెల్లంకొండ ప్రతాప్ (32) అతడిని ఇంటికి చేరుస్తామని నమ్మబలికారు. అతడి ద్విచ్రకవాహనంపై ఇంటి వద్దకు చేరుకోగానే బైక్తో ఉడాయించారు. వారిని ఆపేందుకు గురు యోగేశ్వర్ ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.