నిబంధనలు పాటించండి : ఎస్పీ
ABN , First Publish Date - 2020-04-06T10:28:47+05:30 IST
లాక్డౌన్ నిబంధనలపై ఎస్పీ రాజకుమారి ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు.
విజయనగరం క్రైం, ఏప్రిల్ 5: లాక్డౌన్ నిబంధనలపై ఎస్పీ రాజకుమారి ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. తొలుత ఆమె నగరంలోని రైతుబజార్లు, మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధాన కూడళ్లలో నగరవాసులకు లాక్డౌన్ నిబంధనలు, కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. బైక్లపై ఒకరికంటే ఎక్కువ మంది ప్రయాణించరాదని, కారులో, ఆటోల్లో ఇద్దరు మాత్రమే ఉండాలని తెలిపారు. రోడ్లపై అనవసరంగా తిరగకూడదన్నారు. తరచూ చేతులు శుభ్రపర్చుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఉదయం 6గంటల నుంచి 11గంటల లోపు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ప్రధాన కూడళ్లలో బైక్లపై ఇద్దరు చొప్పున వెళ్తున్న వారిని ఆపి, ప్లకార్డుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న షాపులను సందర్శించారు. ప్రజలు క్యూలైన్లలో ఉండే విధంగా చూడాలని దుకాణదారులను ఆదేశించారు. కొం దరికి మాస్కులు, శానిటైజర్లు అందించారు. విజయనగరం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, వన్టౌన్ సీఐ ఎర్రంనాయుడు, సీసీఎస్ సీఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
మెసేజ్లను నమ్మొద్దు
కరోనాపై వరల్డ్హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో వస్తున్న మెసేజ్లను నమ్మి మోసపోవద్దని ఎస్పీ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్మార్ట్ఫోన్లకు వచ్చే సంక్షిప్త సమాచారాలు, వాట్సాప్ మెసెజ్లు, ఈ మెయిల్స్ కు ఎవరూ స్పందించరాదని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడొద్దని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లను ఎవరికీ చెప్పరాదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఫోన్కాల్స్, మెసేజ్లతో ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.