ఫుట్పాత్లే పార్కింగ్ అడ్డా..!
ABN , First Publish Date - 2021-05-10T06:00:10+05:30 IST
రహదారులకు ఇరువైపులా లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు పాదచారులకు ఏమాత్రమూ ఉపయోగపడడం లేదు.
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
కేపీహెచ్బీకాలనీ, మే 9 (ఆంధ్రజ్యోతి): రహదారులకు ఇరువైపులా లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు పాదచారులకు ఏమాత్రమూ ఉపయోగపడడం లేదు. కొన్నిచోట్ల చిరు వ్యాపారులకు, మరికొన్ని చోట్ల వాహనాల పార్కింగ్లకు ఉపయోగపడుతున్నాయి. అయినా మూసాపేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కేపీహెచ్బీ ఐదోఫేజ్లోని కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ముందున్న ఫుట్పాత్పై కొన్ని నెలలుగా కార్లను పార్కింగ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కేపీహెచ్బీలో ఫుట్పాత్లపై ఎక్కడ చూసినా టిఫిన్ సెంటర్లు, కూరగాయల దుకాణాలు, టీ స్టాల్స్, మిర్చి బండ్లు నిర్వహిస్తున్నా తమకేమీ పట్టనట్లు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో పాదచారుల కోసం వేసిన ఫుట్పాత్లు పలు విభాగాల అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక జేఎన్టీయూ టూ హైటెక్ సిటీ మార్గం, ఏడోఫేజ్ టూ ఫోరం మాల్, కేపీహెచ్బీ ఈ సేవ రోడ్డు, ఏడోఫేజ్, గోకుల్ ప్లాట్స్ రోడ్డు ఇలా ఎక్కడ చూసినా ఫుట్పాత్లపై ఆక్రమణలే కనిపిస్తాయి. జోరుగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నా, పార్కింగ్ అడ్డాలుగా చేసుకున్నా అధికారులు అటువైపు కన్నెతి చూడడం లేదు. తెలంగాణ హౌసింగ్బోర్డు స్థలాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నా వారు కూడా మిన్నకుండిపోతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, హౌసింగ్బోర్డు ఎవరి పరిధి అయినా సరే ఫుట్పాత్లు అన్యాక్రాంతమవుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాపారులు, పార్కింగ్లకు వినియోగించుకుంటున్న మార్గాలను పాదచారుల రాకపోకల కోసం అందుబాటులోకి తేవాలని కేపీహెచ్బీ ప్రజలు కోరుతున్నారు.