వచ్చే వారంకల్లా 100 కోట్ల డోసులకు..
ABN , First Publish Date - 2021-10-14T06:50:28+05:30 IST
దేశంలో టీకా కార్యక్రమంలో వినియోగించిన డోసుల సంఖ్య అక్టోబరు 18 లేదా 19న 100 కోట్లకు చేరనుంది.
- గత 24 గంటల్లో అర కోటి టీకాలు
- రష్యాలో ఒక్కరోజే 984 మరణాలు
న్యూఢిల్లీ, అక్టోబరు 13: దేశంలో టీకా కార్యక్రమంలో వినియోగించిన డోసుల సంఖ్య అక్టోబరు 18 లేదా 19న 100 కోట్లకు చేరనుంది. బుధవారం సాయంత్రం వరకు 97.79 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్ జరిగింది. ఇందులో 2.83 కోట్ల డోసులను తెలంగాణ, 4.54 కోట్ల డోసులను ఆంధ్రప్రదేశ్ వినియోగించాయి. ఇక దేశంలో మొత్తం క్రియాశీల కొవిడ్ కేసుల సంఖ్య బుధవారం 214 రోజుల కనిష్ఠానికి తగ్గి 2.07 లక్షలకు చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం 3.40 కోట్ల కొవిడ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 0.61 శాతమే.
దేశంలో కొత్తగా 15,823 కొవిడ్ కేసులు నమోదవగా, 226 మంది మృతిచెందారు. కాగా, కొవిషీల్డ్ టీకాను తీసుకున్న భారత ప్రయాణికులపై విధించిన కొవిడ్ ఆంక్షలను బ్రిటన్ ఈనెల 11న ఎత్తివేసిన నేపథ్యంలో.. భారత్ కూడా అదే విధమైన నిర్ణయాన్ని తీసుకుంది. టీకా తీసుకున్న బ్రిటన్ ప్రయాణికులకు క్వారంటైన్ ఉండబోదని ప్రకటించింది. ఇక రష్యాలో 24 గంటల వ్యవధిలోనే 984 మంది కరోనాతో మృతిచెందారు. మరోవైపు కొవిడ్ నేపథ్యంలో మూసివేసిన కెనడా, మెక్సికో సరిహద్దు మార్గాలను నవంబరులో తెరవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.
‘డెల్టా’పై స్పుత్నిక్-లైట్ ప్రభావశీలత 70%
డెల్టా కరోనా వేరియంట్పై రష్యాకు చెందిన సింగిల్ డోసు కొవిడ్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-లైట్’ 70 శాతం ప్రభావశీలతతో పనిచేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఏడాది జూలైలో టీకా తీసుకున్న 28వేల మంది ఆరోగ్య నివేదికల విశ్లేషణలో ఈ విషయాన్ని గుర్తించినట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), గమలేయ సెంటర్ తెలిపాయి. స్పుత్నిక్-లైట్ వేయించుకున్న వారికి వైరస్ నుంచి బలమైన రక్షణ లభించిందని పేర్కొన్నాయి. ఈ వివరాలను ‘మెడ్ ఆర్కైవ్’ జర్నల్లో ప్రచురించాయి.