పనిచేయని వలంటీర్లెందుకు?
ABN , First Publish Date - 2020-03-30T09:02:46+05:30 IST
మున్సిపాల్టీలలో చాలా మంది వలంటీర్లు సరిగ్గా పనిచేయడం లేదు.
వారి జాబితా తయారు చేయండి
పట్టణాలలో పారిశుధ్యం అధ్వానం
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్యామలరావు
రాజమహేంద్రవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీలలో చాలా మంది వలంటీర్లు సరిగ్గా పనిచేయడం లేదు. అటువంటివారెందుకు... పరిశీలనలో పెట్టండి... వారి జాబితా తయారు చేయండి... పని చేయని వాళ్లకు రూ.5వేలు ఎందుకు అని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు హెచ్చరించారు. పట్టణాభివ్ధృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కమిషనర్లతో ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ ప్రతీరోజూ ఇంటింటీకి వెళ్లి అక్కడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్య అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.
ఇతర పనులు ఏమీ లేవు. ఇవాళ సచివాలయ ఉద్యోగులు కూడా ఇదే కరోనా పనులే చేయాలి. టౌన్ప్లానింగ్ సిబ్బంది ఈ పనులలోనే ఉండాలని ఆయన అన్నా రు. మున్సిపాల్టీలలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఇది గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చెప్పిన మాట. పారిశుధ్యం బాగాలేకపోతే అక్కడి కమినర్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ఇక ప్రతీ మున్సిపాల్టీలోనూ కరోనా వైరస్ నియంత్రణ చర్యల కోసం జోన్లు విభజించాలి. ప్రస్తుతం మూడువార్డులు లేదా, రెండు వార్డుల సచివాలయాలకు ఒక పర్యవేక్షక టీమ్లను నియమించాలని కమిషనర్లను ఆదేశించారు.