చినుకు కోసం.. నేల నిరీక్షణ

ABN , First Publish Date - 2021-06-24T04:50:59+05:30 IST

ముందస్తు కురిసిన వర్షాలకు రైతులు బావులు, బోర్ల కింద పంటలు సాగు చేశారు.

చినుకు కోసం.. నేల నిరీక్షణ
ఆకాశంలో కమ్ముకున్న కారుమబ్బులు

ముందు మురిపించిన తొలకరి చినుకులు

15 రోజులుగా జాడలేకపోవడంతో రైతుల్లో ఆందోళన

ఇప్పటికే పొలాల్లో వేసిన విత్తనాలు ఎండిపోయే అవకాశం

వర్షం కోసం ఆశగా అన్నదాతల ఎదురుచూపు

గోనెగండ్ల, జూన్‌ 23: ముందస్తు కురిసిన వర్షాలకు రైతులు బావులు, బోర్ల కింద పంటలు సాగు చేశారు. ఇప్పుడేమో వాన జాడ కనిపించడం లేదు. ఎండ వేడికి నేలలో విత్తనాలు వాన కోసం ఎదురు చూస్తున్నాయి. పొలంలో విత్తనం మగ్గిపోతుందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల్లో దాదాపు 20 వేల హెక్టార్లలో వేరుశనగ, పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, ఆముదం తదితర పంటలు సాగు చేశారు. మరో 30 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గడిచిన రెండు వారాల నుంచి వానదేవుడు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి కనిపించడం లేదు. సాయంత్ర పూట కారు మబ్బులు కమ్మి మేఘాలు ఊరిస్తున్నాయే తప్ప చినుకు పడటం లేదు.


ఏఏ పంట ఎన్నెన్ని హెక్టార్లలో అంటే..

ఇప్పటి వరకు పది వేల హెక్టార్లలో పత్తి, మూడు వేల హెక్టార్లలో ఉల్లి, ఏడు వేల హెక్టార్లలో వేరుశనగ, కంది, ఆముదాలు, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే తిరిగి విత్తనాలు వేసుకోవాల్సిందే.


వర్షం కురవకపోతే ఇక అంతే: బడేసానాయుడు, రైతు గోనెగండ్ల

నాలుగు ఎకరాల్లో వేరుశనగ, ఉల్లి, పత్తి పంటలను సాగు చేశా. విత్తనం వేసి వారం రోజులు గడుస్తోంది. ఈదురు గాలులు ఎక్కువగా ఉండటం వల్ల పొలంలోని తేమంతా ఆరిపోతోంది. వారం రోజుల్లో వర్షం కురవకపోతే పొలంలోని విత్తనాలు ఎండిపోతాయి.


భూమిలో ఎండ వేడిమి తగ్గలేదు: చెన్నలరాయుడు, రైతు గోనెగండ్ల

గతంలో కురిసిన వర్షాల వల్ల అప్పట్లో భూమి చల్లబడినట్లు అనిపించిందేకాని వేడిమి తగ్గలేదు. అప్పట్లో కురిసిన వర్షాల వల్ల భూమి పదునైంది. మరో వారం రోజుల్లో వర్షం కురవకపోతే ఇప్పటి వరకు సాగు చేసిన విత్తనాలు ఎండిపోతాయి.


Updated Date - 2021-06-24T04:50:59+05:30 IST