చవితి ఉత్సవాలకు..కొవిడ్ నిబంధనలు
ABN , First Publish Date - 2020-08-14T11:35:53+05:30 IST
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీసు శాఖ పలు ఆంక్షలు, నిబంధనలు విధించింది.
గ్రామం అంతటికీ ఒక్క విగ్రహమే పెట్టాలి
నాలుగు అడుగులకు మించకూడదు
మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలి
మండపాల వద్ద తీర్థప్రసాదాలు బంద్
సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులపై నిషేధం
ఐదు రోజుల్లోనే నిమజ్జనం ప్రక్రియ పూర్తి
కొయ్యూరు, ఆగస్టు 13: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీసు శాఖ పలు ఆంక్షలు, నిబంధనలు విధించింది. గతంలో మాదిరిగా వీధికో మండపం ఏర్పాటుచేయడానికి వీలులేదు. గ్రామం మొత్తానికి కలిపి ఒకే ఒక్క వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేయాలి. ఈ మేరకు నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు జారీచేసినట్టు కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. ఇంకా ఏయే నిబంధనలు వున్నాయంటే...ఉత్సవాలకు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలి. ఎత్తు నాలుగు అడుగులకు మించకూడదు. మండపాల వద్ద ఎటువంటి సౌండ్ సిస్టం బాక్సులు పెట్టకూడదు. మండపాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు వంటివి పంపిణీ చేయడానికి వీలులేదు. సాంస్కృతిక కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ఠ/నిమజ్జన సమయాల్లో ఊరేగింపులు నిషేధం. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఐదు రోజుల్లోగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. వీటిల్లో ఏ ఒక్కదానిని అతిక్రమించినా కొవిడ్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.