ఆ పెళ్లికి నలుగురే అతిథులు!
ABN , First Publish Date - 2020-04-06T21:03:07+05:30 IST
సాధారణంగా పెళ్లంటే బోల్డంత హంగామా ఉంటుంది. బాజాలు, భజంత్రీలు, బంధుమిత్రుల హంగామా, డీజే.. పెళ్లిలో
మొహాలి: సాధారణంగా పెళ్లంటే బోల్డంత హంగామా ఉంటుంది. బాజాలు, భజంత్రీలు, బంధుమిత్రుల హంగామా, డీజే.. పెళ్లిలో ఇదంతా సర్వసాధారణమైన విషయం. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని పంజాబ్లోని మొహాలీలో ఓ పెళ్లి అత్యంత సాధారణంగా జరిగింది. నలుగురంటే నలుగురే ఈ పెళ్లికి హాజరయ్యారు. అది కూడా వధూవరుల తరపువారే. అదొక్కటే కాదు మరో విశేషం కూడా ఉందీ పెళ్లిలో. పెళ్లికుమార్తె మెడలో వరుడు తాళి కట్టడానికి ముందు అతడిని పూర్తిగా శానిటైజ్ చేశారు.
మొహాలీలోని దవాన్ గ్రామంలో జరిగిందీ నిరాడంబర కరోనా వివాహం. వధువు గగన్దీప్ కౌర్, ఖన్నా గ్రామానికి చెందిన వరుడు రాజ్దీప్ సింగ్తో మెడలో తాళికట్టించుకుంది. వివాహం అనంతరం రాజ్దీప్ సింగ్ మాట్లాడుతూ.. తమ పెళ్లి కోసం బంధువులు అమెరికా, కెనడా నుంచి వచ్చారని, కానీ కర్ఫ్యూ కారణంగా వివాహానికి హాజరుకాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారందరూ ఖన్నాలోని తమ ఇంట్లోనే బందీలుగా ఉండిపోయారని పేర్కొన్నాడు.