విదేశీ ఈ-కామర్స్‌ కంపెనీల ఆటకట్టు!

ABN , First Publish Date - 2020-07-07T08:38:33+05:30 IST

దేశంలోని పలు రంగాల్లో విదేశీ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. దీని వల్ల దేశీయంగా పురుడుపోసుకునే కొన్ని కంపెనీలు ఆదిలోనే అంతరించిపోతున్నాయి...

విదేశీ ఈ-కామర్స్‌ కంపెనీల ఆటకట్టు!

  • స్థానిక స్టార్ట్‌పలకు దన్ను
  • ఈ-కామర్స్‌ రంగానికి రెగ్యులేటర్‌ 
  • సమాచార నిబంధనలు మరింత కఠినం
  • పోటీ ఉండేలా చర్యలు 
  • విధాన ముసాయిదాలో వెల్లడి 

న్యూఢిల్లీ, జూలై 6: దేశంలోని పలు రంగాల్లో విదేశీ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. దీని వల్ల దేశీయంగా పురుడుపోసుకునే కొన్ని కంపెనీలు ఆదిలోనే అంతరించిపోతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఆరంభంలో నిలదొక్కుకున్నా.. మనుగడ సాగించడానికి అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. దేశీయ ఈ-కామర్స్‌ రంగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రంగంలో తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. కొన్ని కంపెనీల విపరీత ధోరణులను ఇతర కంపెనీలు ఎదుర్కోలేకపోతున్నాయి. వినియోగదారులు కోట్లలో ఉంటున్నా రు. వీరికి సంబంధించిన కీలక సమాచారం ఈ కంపెనీల చేతిలో ఉంటోంది. సమాచార భద్రతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త ఈ-కామర్స్‌ విధానానికి రూపకల్పన చేస్తోంది. ఈ విధానానికి సంబంధించిన ముసాయిదాలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.


విదేశీ కంపెనీల ఆగడాలను కట్టడి చేసే విధంగా నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం.. స్థానిక స్టార్టప్‌ కంపెనీలకు దన్నుగా నిలిచే చర్యలు ప్రభు త్వం తీసుకోబోతోంది. అంతేకాకుండా కంపెనీలు తమ వద్దనున్న సమాచారాన్ని (డేటా) ఏవిధంగా నిర్వహిస్తున్నాయో ప్రభుత్వం పర్యవేక్షించనుంది. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ తదితర విదేశీ కంపెనీల ఆధిపత్యం అధికమవుతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్టవేయాలన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సర్కారు గత రెండేళ్లుగా ఈ-కామర్స్‌ విధానంపై పని చేస్తోంది. వాణిజ్య శాఖలోని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం ఈ ముసాయిదా విధానాన్ని రూపొందించింది. 

ప్రభుత్వం తీసుకురాబోయే విధానం ప్రకారం ఈ-కామర్స్‌ రంగంలోని కంపెనీల మధ్య పోటీని పర్యవేక్షిస్తూ నియంత్రించడానికి ఒక రెగ్యులేటర్‌ను ప్రభు త్వం నియమించనుంది. ఈ రెగ్యులేటర్‌ అవసరమైన సమాచార వనరులను పొందేందుకు అధికారం కల్పించనున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ కంపెనీలకు సోర్స్‌ కోడ్స్‌, ఆల్గరిథమ్‌లను కూడా ప్రభుత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. వీటి వల్ల పోటీదారుల్లో ఉన్న డిజిటల్‌ ప్రేరేపిత పక్షపాతాన్ని తొలగించే అవకాశం ఏర్పడనుంది. 


అన్నింటా పోటీ

దేశంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. దాదాపు 50 కోట్ల మంది డిజిటల్‌ సేవలను వినియోగించుకుంటున్నారని సమాచారం. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ నుంచి కంటెంట్‌ స్ర్టీమింగ్‌ వరకు, మెసేజ్‌ల నుంచి డిజిటల్‌ చెల్లింపుల వరకు అన్ని విభాగాల్లోనూ పోటీ నెలకొంటోంది. ఈ విభాగాల్లో అంతర్జాతీయంగా ఉన్న బడా కంపెనీలదే హవా. మన దేశంలో అపార అవ కాశాలున్న కారణంగా ఈ కంపెనీలు దేశంలోకి ప్రవేశించి క్రమంగా తమదే పైచేయిగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థాని క స్టార్టప్స్‌ ప్రభుత్వ శరణుజొచ్చాయి. ఇటీవలే చైనా  యాప్‌లను భారత్‌ నిషేధించింది.  దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలు, స్థానిక ఏకోసిస్టమ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎక్కువ సంఖ్యలో సర్వీసులు అందించే కంపెనీలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. కంపెనీలు మార్కె ట్లో తమ నాయకత్వ స్థానాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండే విధానాలు అనుసరిస్తోంది.  


72 గంటల్లో సమాచారం ఇవ్వాలి

ప్రభుత్వ ముసాయిదా విధానం ప్రకారం.. ఈ-కామర్స్‌ కంపెనీలు ప్రభుత్వం కోరిన 72 గంటల్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. జాతీయ భద్రతా, టాక్సేషన్‌, లా అండ్‌ ఆర్డర్‌ వంటివి ఇందులో ఉన్నా యి. ఈ-కామర్స్‌ కంపెనీలు వినియోగదారులకు అమ్మకందారుల వివరాలు అందించాలి. వారి ఫోన్‌ నెంబర్లు, కస్టమర్‌ ఫిర్యాదు కాంటాక్ట్‌ లు, ఈ-మెయిల్‌, చిరునామాలు ఇవ్వాలి. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులైతే అవి ఏ దేశానికి చెందినవో తెలియజేయాలి. 


Updated Date - 2020-07-07T08:38:33+05:30 IST