ఢిల్లీ మర్కజ్ : వీసా షరతులను ఉల్లంఘించిన విదేశీయులపై చర్యలు

ABN , First Publish Date - 2020-04-01T22:56:50+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో విజయం సాధించామని సంతోషపడుతున్న సమయంలో ఢిల్లీలోని మర్కజ్

ఢిల్లీ మర్కజ్ : వీసా షరతులను ఉల్లంఘించిన విదేశీయులపై చర్యలు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో విజయం సాధించామని సంతోషపడుతున్న సమయంలో ఢిల్లీలోని మర్కజ్ ఉదంతం తీవ్ర ఆందోళన కలిగించింది. ఇక్కడి తబ్లిగి జమాత్‌లో విదేశీయులు, మన దేశస్థులతో కలిసి మెలసి తిరిగారు. దీంతో కరోనా వైరస్ కొందరికి సోకింది. ఇదిలావుండగా, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 


రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపైనా, తబ్లిగి జమాత్ నిర్వాహకులపైనా చట్టపరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు తెలిపింది. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారిని గుర్తించడం చాలా ముఖ్యమని తెలియజేసినట్లు పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వల్ల ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని తెలిపినట్లు వివరించింది.



ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను వచ్చే వారంలోగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరినట్లు తెలిపింది. ఈ పథకం లబ్ధిదారులకు నగదు బదిలీ జరుగుతుందని పేర్కొంది. సామాజిక దూరాన్ని పాటిస్తూ, దీనిని అమలు చేయాలని పేర్కొంది. రాష్ట్రంలోపల సరుకు రవాణాను అనుమతించాలని, అయితే సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం సమగ్రంగా అమలవుతోందని పేర్కొంది. 



Updated Date - 2020-04-01T22:56:50+05:30 IST