కాటేసిన కరోనా..
ABN , First Publish Date - 2021-04-22T05:42:05+05:30 IST
కాటేసిన కరోనా..
మహమ్మారితో ఫారెస్టు బీట్ ఆఫీసర్ మృతి
ఏటూరునాగారం రూరల్, ఏప్రిల్ 21 : కరోనా మహమ్మరి అటవీ శాఖ అధికారిని బలిగొంది. ములుగు జిల్లా ఏటూరునాగారం ఉత్తర విభాగం పరిధిలోని బానాజీ బంధం బీట్ ఆఫీసర్ గా పని చేస్తున్న చేలా పద్మ (30) కరోనా బారిన పడి బుధవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఐదు రోజుల క్రితం పద్మకు జ్వరం రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యాధికారులు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని, వేరే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు కరోనా నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా చికిత్స అందిస్తున్న క్రమంలో పద్మ మంగళవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త తిరుపతి, కూతురు, కుమారుడు ఉన్నారు. భర్త కానిస్టేబుల్గా పని చేస్తున్నారు.