ఈ దేవతల కోసం గ్రామస్థుల త్యాగం...

ABN , First Publish Date - 2021-11-01T16:50:06+05:30 IST

ప్రతి ఏటా వచ్చే వలస పక్షుల పరిరక్షణ కోసం పటాకులు పేల్చకుండా నిర్ణయం తీసుకున్న వినూత్న ఘటన...

ఈ దేవతల కోసం గ్రామస్థుల త్యాగం...

దశాబ్దాలుగా పటాకులు పేల్చని వైనం 

శివగంగ(తమిళనాడు): ప్రతి ఏటా వచ్చే వలస పక్షుల పరిరక్షణ కోసం పటాకులు పేల్చకుండా నిర్ణయం తీసుకున్న వినూత్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కొల్లుకుడిపట్టి, వెట్టంగుడిపట్టి గ్రామాల్లో వెలుగుచూసింది. అతిథులను దేవుళ్లుగా భావించడం భారతీయ సంస్కృతిలో భాగం. దీనిలో భాగంగా తమ గ్రామాలకు ప్రతి ఏటా వస్తున్న వలస పక్షుల కోసం కొల్లుకుడిపట్టి, వెట్టంగుడిపట్టి గ్రామ ప్రజలు పటాకులు పేల్చకుండా త్యాగం చేస్తున్నారు. వెట్టంగుడి పక్షుల అభయారణ్యం తిరుపత్తూరు మదురై జాతీయ రహదారిపై ఉంది.కొల్లుకుడిపట్టి, వెట్టంగుడిపట్టి గ్రామాలు సింగంపునరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.


వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళికి ముందు పటాకులు కాల్చడంపై ఆంక్షలు విధించాయి.  అయితే కొల్లుకుడిపట్టి, వెట్టంగుడిపట్టి గ్రామస్థులు మాతం తాము దేవుళ్లుగా భావించే వలస పక్షుల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా పటాకులు పేల్చడం లేదు.కొల్లుకుడిపట్టి, వెట్టంగుడిపట్టిలలోని మూడు చెరువులకు 15వేల వలస పక్షులు వస్తున్నాయని వీరవన్ చెప్పారు. వలసపక్షులకు నిలయమైన తమ గ్రామాల్లో దశాబ్దాలుగా పటాకులు పేల్చకుండా నిశ్శబ్ద దీపావళి జరుపుకుంటున్నామని స్థానికులు చెప్పారు.


తమ గ్రామస్థులు ఏనాడు బాణసంచా పేల్చలేదని కొల్లుకుడిపట్టి, వెట్టంగుడిపట్టి గ్రామస్థులు చెప్పారు.శ్రీలంక, చైనా, మయన్మార్, మాల్దీవుల నుంచి మొత్తం 23 జాతుల పక్షులు కొల్లుకుడిపట్టి, వెట్టంగుడి గ్రామాలకు వలస వస్తున్నాయని తిరుపత్తూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎ మతివన్నన్ చెప్పారు.పక్షులు గూడు కట్టుకొని, గుడ్లు పెట్టి వాటిని పొదిగిన తర్వాత అవి పెరిగి పోయేందుకు కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని మతివన్నన్ తెలిపారు.తమ గ్రామాల చెరువుల్లోకి వచ్చే వలస పక్షుల అతిథి దేవుళ్ల కోసం తాము దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం లేదని గ్రామస్థులు ముక్తకంఠంతో చెప్పారు. 


Updated Date - 2021-11-01T16:50:06+05:30 IST