రైల్లో మరిచిపోయిన వస్తువులు బాధితులకు అప్పగింత

ABN , First Publish Date - 2021-10-18T06:00:11+05:30 IST

రైల్లో మరిచిపోయిన విలువైన వస్తువులను బాధితులకు అప్పగించిన రైల్వే రక్షణ దళం సిబ్బందిని డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ, సీనియర్‌ డివిజినల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రఘువీర్‌ అభినందించారు.

రైల్లో మరిచిపోయిన వస్తువులు బాధితులకు అప్పగింత
విశాఖ ఆర్పీఎఫ్‌ స్టేషన్‌లో బాధితులకు బ్యాగ్‌ అప్పగిస్తున్న సిబ్బంది

 ఆర్పీఎఫ్‌ సిబ్బందిని అభినందించిన డీఆర్‌ఎం

విశాఖపట్నం, అక్టోబరు 17: రైల్లో మరిచిపోయిన విలువైన వస్తువులను బాధితులకు అప్పగించిన రైల్వే రక్షణ దళం సిబ్బందిని డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ, సీనియర్‌ డివిజినల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రఘువీర్‌ అభినందించారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం విజయనగరానికి చెందిన సాలగ్రామ నామని అనే ప్రయాణికుడు పాట్నా-ఎర్నాకులం (02644) ఎక్స్‌ప్రెస్‌ ఏ1 కోచ్‌లో ప్రయాణించి తన వెంట తీసుకువచ్చిన సుమారు రూ.1.05 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొంత నగదుతో కూడిన బ్యాగ్‌ను ఆదమరుపులో రైల్లో విడిచిపెట్టి విజయనగరం స్టేషన్‌లో దిగిపోయాడు. రైలు కదిలిపోయిన తర్వాత బ్యాగ్‌ను విడిచిపెట్టినట్టు గుర్తుకు వచ్చి ఆర్పీఎఫ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడ నుంచి విశాఖ ఆర్పీఎఫ్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది పాట్నా-ఎర్నాకులం రైలు విశాఖ స్టేషన్‌కు చేరిన వెంటనే ఏ1 కోచ్‌లోకి వెళ్లి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకుని విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న బాధితులను ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రాథమిక విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించి బ్యాగ్‌ను అప్పగించారు. మరో ఘటనలో రాజమండ్రికి చెందిన ఎం.శివదుర్గ అనే ప్రయాణికుడు కృష్ణరాజపురం-భువనేశ్వర్‌ హంసఫర్‌ (02886) ఎక్స్‌ప్రెస్‌ బీ-13 కోచ్‌లో ప్రయాణించి రూ.లక్ష 30 వేలు విలువైన రెండు ల్యాప్‌టాప్‌లను రైల్లో విడిచిపెట్టి రాజమండ్రి స్టేషన్‌లో దిగిపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు దువ్వాడ ఆర్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమై ఆ రైలు దువ్వాడ చేరిన వెంటనే కోచ్‌లోకి ప్రవేశించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని బాధితునికి అప్పగించారు. 


Updated Date - 2021-10-18T06:00:11+05:30 IST